ధోతీ పాట హంగామా

25 Jul, 2014 23:33 IST|Sakshi
ధోతీ పాట హంగామా

‘‘అతీంద్రియ దృష్టి నేపథ్యంలో ఇతర భాషల్లో పలు చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇది తొలి ప్రయత్నం కాదు. కానీ, ఓ కొత్త అంశంతో ఈ సినిమా చేశాను. వైవిధ్యభరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే చక్కని థ్రిల్లర్ ఇది. సినిమా విజయం మీద పూర్తి నమ్మకం ఉంది’’ అని దర్శకుడు నీలకంఠ చెప్పారు. హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మా, నందినీరాయ్ ముఖ్య తారలుగా షిర్డీ సాయి కంబైన్స్ పతాకంపై ఎమ్వీకే రెడ్డి, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మాయ’.
 
నీలకంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 1న విడుదల కానుంది. ఈ సందర్భగా శుక్రవారం లగడపాటి శ్రీధర్ ప్రచార గీతాన్ని విడుదల చేశారు. మధుర శ్రీధర్ మాట్లాడుతూ -‘‘ఈ కథతో పాటు ‘పోకిరి రాజా..’ పాట కూడా ముందుకు నడుస్తుంది. దాన్ని రీమిక్స్ చేశాం. అతి తక్కువ సమయంలో ఈ ‘ధోతీ సాంగ్..’ను చిత్రీకరించాం. ఇది ఇతివృత్తం మీద ఆధారపడిన చిత్రం’’ అన్నారు.  ప్రచార గీతం చాలా బాగుందనీ, ఈ చిత్రం నీలకంఠకు మంచి పేరు తెస్తుందనీ లగడపాటి శ్రీధర్ చెప్పారు. ఇంకా హర్షవర్ధన్ రాణే, సిరాశ్రీ, రమ తదితరులు పాల్గొన్నారు.