నేను లాయర్‌ని.. మంచి లాయర్‌ని కాదు

5 Nov, 2017 00:57 IST|Sakshi

రచయిత రాకేందు మౌళి హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. హరీష్‌ కేవీని దర్శకుడిగా పరిచయం చేస్తూ మేజిన్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై సయ్యద్‌ నిజాముద్దీన్‌ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కల్పిక కథానాయిక. రాకేందుమౌళి–కల్పిక–కృష్ణ భగవాన్‌లపై చిత్రీకరించిన మొదటి సన్నివేశానికి నటి సోనీ చరిష్టా కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ (గోపి) క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత సయ్యద్‌ నిజాముద్దీన్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ‘మాకొక మంచి లాయర్‌ కావాలని అడిగితే మీ పేరు చెప్పారు’ అని హీరో, హీరోయిన్‌ అంటే... ‘అయితే మీకెవరో తప్పు చెప్పారు.

నేను లాయర్‌ని మాత్రమే. మంచి లాయర్‌ని మాత్రం కాదు’ అంటూ కృష్ణ భగవాన్‌ చెప్పే సన్నివేశాన్ని మొదటి షాట్‌గా చిత్రీకరించారు. సయ్యద్‌ నిజాముద్దీన్‌ మాట్లాడుతూ– ‘‘నెల్లూరు నేపథ్యంలో కథ ఉంటుంది. హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే క్రైమ్‌ కామెడీగా రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘నన్ను, నా కథను నమ్మి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన సయ్యద్‌ నిజాముద్దీన్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు హరీష్‌. రాకేందు మౌళి, కల్పిక, నటులు ‘థర్టీ ఇయర్స్‌’ పృధ్వీ, కళ్యాణ్‌ విట్టల (‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌) పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామిరెడ్డి.
 

మరిన్ని వార్తలు