ఉచిత విద్య కోసం పోరాటం

23 Apr, 2019 00:32 IST|Sakshi
అఖిల్‌ కార్తీక్, ప్రియాంక శర్మ

సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి.. అప్పుడే సమాజం బాగుంటుందనే సామాజిక సృహతో తెరకెక్కిన చిత్రం ‘ఎమ్‌బిఎమ్‌’ (మేరా భారత్‌ మహాన్‌). అఖిల్‌ కార్తీక్, ప్రియాంక శర్మ జంటగా భరత్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ప్రముఖ వైద్యులు శ్రీధర్‌ రాజు ఎర్ర, తాళ్ల రవి, టి.పల్లవి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో భరత్‌ మాట్లాడుతూ– ‘‘లవ్, కామెడీ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా తెరకెక్కించాం. మన వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను సవరించాలన్నదే మా అభిప్రాయం.

ముఖ్యంగా విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్నదే మా పోరాటం’’ అన్నారు. చిత్ర నిర్మాత, కథా రచయిత, నటుడు డా.శ్రీధర్‌ రాజు ఎర్ర మాట్లాడుతూ– ‘‘సమకాలీన అంశాలకు కమర్షియల్‌ హంగులు జోడించి ఓ సందేశాత్మక చిత్రంగా  నిర్మించాం. ఇప్పటి ప్రభుత్వాలు ప్రవేశపెడుతోన్న పథకాలు, వాటిలో లోటుపాట్లు చూపిస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఇటీవల వరంగల్‌ జిల్లాలో అప్పుల బాధతో మరణించిన రెండు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.  డా.తాళ్ల రవి, డా. టి.పల్లవి రెడ్డి, అఖిల్‌ కార్తీక్, రచయిత ‘అంపశయ్య’ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ముజీర్‌ మాలిక్, సంగీతం: లలిత్‌ సురేష్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సోమర్తి సాంబేష్‌.

మరిన్ని వార్తలు