కొంచెం కొత్తగా చేయమన్నారు

27 Aug, 2017 00:19 IST|Sakshi
కొంచెం కొత్తగా చేయమన్నారు

 ‘అల్లరి’ నరేశ్‌

‘‘గమ్యం’ సినిమాలో నేను చేసిన గాలి శీను పాత్ర నవ్విస్తూనే ఏడిపిస్తుంది. అలాంటి కథ కోసం చాలా కాలం ఎదురు చూశా. ‘నేను, గమ్యం’ చిత్రాల తరహా సీరియస్‌ సినిమా చేద్దామని ‘కెవ్వు కేక’ టైమ్‌ నుంచి చంద్రశేఖర్‌గారు అడుగుతున్నారు. కామెడీకి థ్రిల్లర్‌ అంశాల్ని జోడించిన అటువంటి కథే మలయాళ ‘ఒరు వడక్కన్‌ సెల్ఫీ’. నిర్మాతకు, నాకు బాగా నచ్చడంతో ‘మేడమీద అబ్బాయి’గా తెలుగులో రీమేక్‌ చేశాం’’ అని ‘అల్లరి’ నరేశ్‌ అన్నారు. నరేశ్, నిఖిలా విమల్‌ జంటగా జి. ప్రజిత్‌ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించిన చిత్రం ‘మేడ మీద అబ్బాయి’.

ట్రైలర్‌ని విడుదల చేసిన అనంతరం నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘మీ సినిమాలు మూస ధోరణిలో ఉంటున్నాయి. కొంచెం కొత్తగా ప్రయత్నించమని చాలామంది అడిగారు. కొత్తగా చేయాలని ఆలోచించి చేసిన ప్రయత్నమే ఈ ‘మేడ మీద అబ్బాయి’. సెప్టెంబర్‌ 8న సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అల్లరి, ప్రాణం, గమ్యం, శంభో శివ శంభో... ఈ నాలుగు సినిమాలు కలిస్తే ఎలా ఉంటుందో ‘మేడమీద అబ్బాయి’ ఆ స్థాయిలో ఉంటుంది’’ అన్నారు నిర్మాత. నటుడు ‘హైపర్‌’ ఆది, రచయిత విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు ఎమ్మెస్‌ కుమార్, సీతారామరాజు పాల్గొన్నారు.