రజని, విజయ్‌లపై మీరామిథున్‌ ఫైర్‌  

15 Jul, 2020 08:23 IST|Sakshi

నటి మీరా మిథున్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్, ఇళయదళపతి విజయ్‌లను వదలడం లేదు. వివాదాలకు పెట్టింది పేరుగా ముద్రవేసుకున్న నటి మీరా. 2016లో ఫెమీనా మిస్‌ సౌత్‌గా కిరీటాన్ని గెలుచుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత పలు వివాదాలతో ఆ కిరీటం కోల్పోయింది. కాగా 8 తూట్టాగల్‌ చిత్రంలో కథానాయక నటించిన మీరామిథున్‌ ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో గుర్తింపు లేని పాత్రలో నటించింది. అయితే బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌షో లో పాల్గొని మరోసారి వివాదాలకు కేంద్రంగా మారింది. ఆ గేమ్‌ షోలో దర్శకుడు చేరన్‌ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు గుప్పించడంతో పాటు ఆ షోకు వ్యాఖ్యాత గా బాధ్యతలు నిర్వహించిన కమలహాసన్‌ను ఈ అమ్మడు వదల్లేదు. దర్శకుడు చేరన్‌ చర్యలు తెలిసి కూడా కమలహాసన్‌ ఖండించలేదు అని విమర్శించింది. ఇక బిగ్‌బాస్‌ షో నుంచి వచ్చిన తర్వాత సినీ అవకాశాలు ముంగిట వాలతాయని భావించిన మీరా మిథున్‌కు అక్కడ నిరాశే ఎదురైంది.

దీంతో తనను తమిళ చిత్ర పరిశ్రమ పట్టించుకోవడంలేదని, బాలీవుడ్లో సెటిల్‌ కానున్నట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తనకు హిందీ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నట్లు ప్రచారం చేసుకుంది. అయితే బాలీవుడ్లోనూ ఈ అమ్మడిని పట్టించుకున్న నాథుడే లేడు. దీంతో ఇప్పుడు తమిళ చిత్ర ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతోంది. కోలీవుడ్లో తన ఎదుగుదలను నటుడు రజనీకాంత్, విజయ్‌ అడ్డుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తూ సోమవారం తన ట్విట్టర్‌లో పేర్కొంది. అందులో తమిళనాడు తమిళులకు హిందువులకు చెందిందని, అయితే ఇక్కడ మలయాళీలు క్రిస్టియన్‌ ఆధిపత్యం సాగుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కండక్టర్‌ రజనీకాంత్, క్రిస్టియన్‌ విజయ్‌ తన పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది.

సైబర్‌ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని పేర్కొంది. ఇవన్నీ భగవంతుడు చూస్తున్నాడని అంది. కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి తానేనంటూ ట్విట్టర్లో పేర్కొంది. అదేవిధంగా కన్నగి మదురైని దహించినట్టుగా తాను తమిళనాడును దహించి వేస్తానని మరోసారి పేర్కొంది. ఇలా ఒకదానికి ఒకటి సంబంధంలేని వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందాలని చూస్తున్న నటి మీరామిథున్‌పై ఇప్పుడు రజనీకాంత్, విజయ అభిమానులు ఆగ్రహంతో మండి పడుతున్నారు. ట్విట్టర్‌లో ఆమెను ఏకేస్తున్నారు.  నటి మూడో పెళ్లిపై విమర్శలు..

మరిన్ని వార్తలు