మూడు సినిమాలు లైన్లో పెట్టాడు

13 Jan, 2016 13:35 IST|Sakshi
మూడు సినిమాలు లైన్లో పెట్టాడు

మెగా వారసుడు వరుణ్ తేజ్ జోరు పెంచాడు. మాస్ ఇమేజ్ కోసం రిస్క్ చేయకుండా నెమ్మదిగా అడుగులేస్తున్న ఈ ఆరడుగుల అందగాడు 2016లో జోరు పెంచుతున్నాడు. తొలి సినిమా ముకుందతో పరవాలేదనిపించిన వరుణ్, రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన కంచె సినిమాతో మంచి మార్కులు సాధించాడు. అయితే ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఆకట్టుకోకపోవటంతో సొంతంగా మార్కెట్ క్రియేట్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యాడు.

మాస్ ఇమేజ్ మీద దృష్టి పెట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ సినిమా చేసినా.. అది కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూడు సినిమాలు వరుణ్కు కమర్షియల్ స్టార్ ఇమేజ్ తీసుకురాకపోయినా విషయం ఉన్న నటుడిగా నిరూపించాయి. అందుకే వరుణ్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ ఈ యంగ్ హీరో మాత్రం కథ ఎంపికలో తన మార్క్ స్పష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

త్వరలో మరోసారి క్రిష్ దర్శకత్వంలో 'రాయబారి' సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత పండగ చేస్కో సినిమాతో సక్సెస్ కొట్టిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో కమర్షియల్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ మీదకు రాక ముందే మూడో సినిమాను కూడా కన్ఫామ్ చేసేశాడు. దిల్రాజు నిర్మాతగా కొత్త దర్శకుడితో ఈ ఏడాదిలోనే మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు వరుణ్, ఈ మూడు సినిమాలను 2016లోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట మెగా హీరో.