బన్నీపై దుష్ప్రచారం : స్పందించిన మెగా టీం

28 Jul, 2019 11:59 IST|Sakshi

కొద్ది రోజులుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ముందుగా ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న సినిమాకు సంబంధించి కో డైరెక్టర్‌తో అల్లు అర్జున్‌కు గొడవ అయినట్టుగా వార్తలు వచ్చాయి. తరువాత బన్నీ కొత్తగా కొన్న కారవాన్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్‌ వేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా లోకేషన్‌లో బన్నీ డిమాండ్‌లు నిర్మాతలకు తలనొప్పిగా మారాయంటూ ప్రచారం జరుగుతోంది. 

అయితే వరుసగా వస్తున్న ఈ నెగెటివ్‌ వార్తలపై మెగా ఫ్యామిలీ సన్నిహితుడు, పీఆర్వో, నిర్మాత ఎస్కేఎన్‌ స్పందించాడు. అల్లు అర్జున్‌ పై జరుగుతున్న దుష్ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. పద్దెనిమిదేళ్లుగా అల్లు అర్జున్‌ ఎంతో కష్టపడి, శ్రమించి తెచ్చుకున్న  స్టార్‌ ఇమేజ్‌ను కొన్ని వార్తలు తగ్గించలేవు. అంకితభావం, సాయం చేసే మనస్థత్వం ఆయన్ని ఎప్పుడూ అభిమానులకు మరింత చేరువ చేస్తుంది. చివరకు ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం. ప్రస్తుతం ఏఏ19 చిత్రీకరణ జరుగుతోంది అదే సమయంలో తదుపరి రెండు చిత్రాల ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు ఎస్కేఎన్‌.

ప్రస్తుతం అ‍ల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత దిల్ రాజు బ్యానర్‌లో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్‌తో పాటు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు.

మరిన్ని వార్తలు