జోరుగా...

20 Aug, 2018 01:00 IST|Sakshi

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు పంజాబీ బ్యూటీ మెహరీన్‌. ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో జోరు మీదున్నారు. విజయ్‌ దేవరకొండకి జోడీగా ‘నోటా’ చిత్రంలో, వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ చిత్రంలో వరుణ్‌తో జతకట్టారు మెహరీన్‌. మూడు రోజుల కిందట సుధీర్‌ బాబు హీరోగా ప్రారంభమైన సినిమాలోనూ మెహరీనే కథానాయిక. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌తోనూ ఈ బ్యూటీకి జోడీ కుదిరింది.

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్‌ జంటగా శ్రీనివాస్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నవీన్‌ సొంటినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ చాన్స్‌ మెహరీన్‌కి దక్కింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోన్న ఈ చిత్రం షూటింగ్‌లో ఈ బ్యూటీ అడుగుపెట్టారు. సరికొత్త కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీనివాస్‌ని పూర్తిగా కొత్త లుక్‌లో చూపిస్తున్నారట దర్శకుడు. నీల్‌ నితిన్‌ ముఖేష్, హర్షవర్ధన్‌ రాణే, పోసాని కృష్ణమురళి, ‘సత్యం’ రాజేష్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: చాగంటి సంతయ్య, సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్, కెమెరా: ఛోటా కె.నాయుడు.

మరిన్ని వార్తలు