సమాజంలో మహిళలకు రక్షణ లేదు

28 Jan, 2020 03:39 IST|Sakshi
మెహరీన్‌

నాగశౌర్య హీరోగా నటించి, కథను అందించిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్‌ కథానాయిక.  రమణ తేజ దర్శకత్వం వహించగా శంకర్‌ ప్రసాద్‌ సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించారు. జనవరి 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్‌ చెప్పిన విశేషాలు.

► తప్పు జరుగుతున్నప్పుడు అది తçప్పని చెప్పగలిగి, దాన్ని ఆపేవాడే అశ్వథ్థామ. సినిమాలో హీరో పాత్ర అలానే ఉంటుంది. మనందరిలోనూ ఒక అశ్వథ్థామ ఉంటాడు.

► ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనతో నాగశౌర్య ఈ కథ రాశారు. సెట్లో కామ్‌గా ఉంటాడు శౌర్య. కెమెరా ఆన్‌ చేయగానే వేరే మనిషిలా మారిపోతాడు.

► రమణ తేజ ఈ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. సమాజంలో జరుగుతున్నది కూడా ఇదే. ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ లేదు. అప్పుడే పుట్టిన పాప నుంచి వందేళ్ల బామ్మగారి వరకూ ఎవ్వరికీ సురక్షితమైన వాతావరణం లేదు. సినిమా శక్తివంతమైన మాద్యమం. ఇలాంటి కథలను ప్రేక్షకులకు చెప్పాలి.

► ఇప్పటి వరకూ నేను ఇలాంటి పాత్ర చేయలేదు. నాగశౌర్య కూడా ఇంత సీరియస్‌ రోల్‌ చేయలేదు. మా ఇద్దరికీ ఇది కొత్త జానర్‌. సినిమా చాలా స్పీడ్‌గా, సీరియస్‌గా సాగుతుంది. కామెడీ, కమెడీయన్స్‌ ఎవ్వరూ ఉండరు. హీరో ప్రయాణంలో సహాయపడే పాత్ర నాది.

► జనవరిలో నా నుంచి వస్తున్న మూడో చిత్రం ‘అశ్వథ్థామ’. పండక్కి ‘ఎంత మంచివాడవురా!’, పటాస్‌ (తమిళం) విడుదలయ్యాయి. నెలాఖరుకి విడుదల కాబోతున్న ‘అశ్వథ్థామ’ మంచి విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. 

మరిన్ని వార్తలు