కొత్త  కాంబినేషన్‌

10 Feb, 2019 00:07 IST|Sakshi

యువ దర్శకులతో ఈ మధ్య ఎక్కువగా పని చేస్తున్నారు నాగచైతన్య. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రస్తుతం ‘మజిలీ’ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ‘వెంకీ మామ’ చేయనున్నారు. ఈ సినిమా కాకుండా మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారని తెలిసింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ రాజా, కృష్ణార్జున యుద్ధం’ సినిమాలను రూపొందించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించడానికి కమిట్‌ అయ్యారట చైతు.

ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించనున్నారని సమాచారం. నాగచైతన్య కోసం ఓ కొత్త పాయింట్‌ రెడీ చేశారట మేర్లపాక గాంధీ. యూవీ క్రియేషన్‌ బ్యానర్‌ యూత్‌ఫుల్‌ సబ్జెక్ట్స్‌ను ఎంపిక చేసుకోవడంతో పాటు భారీ ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో సినిమాలు రూపొందిస్తారన్న సంగతి తెలిసిందే. ‘మజిలీ’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసి, ఈ నెల మూడో వారం నుంచి ‘వెంకీ మామ’లో జాయిన్‌ అవుతారు నాగచైతన్య. మేర్లపాక గాంధీ సినిమాను కూడా ‘వెంకీ మామ’తో సమాంతరంగా చేస్తారో లేదో వేచి చూడాలి. 
 

మరిన్ని వార్తలు