వాళ్లతో ఎందుకు పని చేయకూడదు?

22 Oct, 2018 01:20 IST|Sakshi
శత్రుజ్ఞ సిన్హా

‘మీటూ’ ఉద్యమ ప్రభావం వల్ల బాలీవుడ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు డైరెక్టర్లు వాళ్లు చేస్తున్న సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ జాబితాలో వికాస్‌ బాల్, సాజిద్‌ ఖాన్, సుభాష్‌ కపూర్, ముఖేష్‌ చాబ్రాలు ఉన్నారు. ‘మీటూ’ ఉద్యమం గురించి తాజాగా సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు శత్రుజ్ఞ సిన్హా స్పందించారు. ‘‘నా 40 ఏళ్ల కెరీర్‌లో ఏ మహిళతోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. ప్రతి మహిళతోనూ చాలా మర్యాదతో నడుచుకుంటున్నాను’’ అన్నారు. మరి.. ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్‌ ఘాయ్‌తో కలిసి మీరు పని చేస్తారా? అంటే.. ‘‘ఎందుకు పని చేయకూడదు. అతను ఇప్పుడు కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాడు.

అతను దోషిగా తేలినప్పటికీ కలిసి పని చేస్తాను. ఎందుకంటే... అతని తప్పు నిరూపితమైతే ఎలాగూ శిక్ష అనుభవిస్తాడు. అయినా.. సంజయ్‌ దత్‌ దోషిగా తేలి జైలుకు వెళ్లొచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కదా?. ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి పనిచేయమని కొందరు అంటున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో వాళ్లు హీరోలుగా హైలైట్‌ కావడానికి అలా మాట్లాడుతున్నారేమో?’’ అన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న దర్శకుడు సాజిద్‌ ఖాన్‌తో(హౌస్‌ఫుల్‌ 4) వర్క్‌ చేయనని అక్షయ్‌ కుమార్, ‘మొఘల్‌’ సినిమాలో సుభాష్‌ కపూర్‌తో  పని చేయనని ఆమిర్‌ ఖాన్‌ చెప్పిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు