కుష్బూకు కోర్టు సమన్లు

16 Feb, 2018 11:43 IST|Sakshi
నటి కుష్బూ

సాక్షి, చెన్నై : కోర్టుకు నేరుగా హాజరుకావాలంటూ నటి కుష్బూకు మేటూర్‌ న్యాయస్థానం న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. 2005 నటి కుష్బూ స్త్రీల మానం గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర వాప్తంగా పెద్ద దుమారేన్నే రేపిన సంగతి తెలిసిందే.  ఈ వ్యాఖ్యలపై మేటూర్‌కు చెందిన మురుగన్‌ అనే న్యాయవాది మేటూర్‌ నేరవిభాగ కోర్టులో నటి కుష్బూకు వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం నటి కుష్బూ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కుష్బూ కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది. దీంతో ఆమె 2005 నవంబర్‌ 16వ తేదీన మేటూర్‌ కోర్టుకు హాజరయ్యారు. మార్గం మధ్యలో కుష్బూ కారుపై కోడిగుడ్లు, టమాటాలు  విసిరారు.

ఈ వ్యవహారంపై సేలం జిల్లాకు చెందిన పాట్టాళ్‌ మక్కల్‌ కట్చి కార్యదర్శి అరివళగన్‌ తదితర 41 మందిపై మేటూర్‌ తహసీల్దార్‌ బోస్‌ముహమదు మేటూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో నటి కుష్బూ, అప్పటి మేటూర్‌ సీఐ దినకరన్‌లను కూడా విచారించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు అప్పటి నుంచి పలుమార్లు విచారణకు వచ్చినా నటి కుష్బూ కోర్టుకు హారజకాలేదు. బుధవారం మరోసారి ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. నిందితుల తరఫున హాజరైన న్యాయవాది మురుగన్‌ హాజరై సాక్షులను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు. అనంతరం న్యాయమూర్తి రాజా కేసు విచారణను వాయిదా వేస్తూ ఆ రోజున నటి కుష్బూ కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు