ఎమ్జీఆర్ వారసుడొస్తున్నాడు!

23 Feb, 2016 02:51 IST|Sakshi
ఎమ్జీఆర్ వారసుడొస్తున్నాడు!

దివంగత నటదిగ్గజం ఎమ్జీఆర్ వారసుడు సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన మనవడు రామచంద్రన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం కబాలి తోట్టమ్. నవ నటుడు విక్కీ మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అనీషా నాయకిగా పరిచయం అవుతున్నారు. గోలీసోడా చిత్ర విలన్ మధు కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో కే.రాజన్, రోబోశంకర్, ఢిల్లీ ఆర్.మురుగానందన్, దాస్‌పాండియన్, సుమలత, రాధ, అరుణ్‌పాండియన్, తంజై తమిళ్ పిత్తన్ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. తిరుచెందూర్ అరుళ్‌మిగు సుబ్రమణిసామి పిక్చర్స్, డాన్స్ లింగా మీడియా టీకే.రాజేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కబాలి తోట్టమ్.

నవ దర్శకుడు టీఆర్.భాస్కర్ కథ, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం ఉదయం స్థానిక వడపళనిలోగల ఆర్‌కేవీ స్టూడియోలో జరిగాయి. చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ దుర్మార్గాన్ని ఎదిరించడానికి ఒకడు వస్తాడు అన్నదే చిత్ర ఒన్‌లైన్ స్టోరీ అని పేర్కొన్నారు.

ఇది చెన్నైలో జరిగిన యదార్థ సంఘటనకు కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. చిత్రాన్ని చెన్నైలోనే చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. దీనికి యూకే.మురళి సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి దర్శకులు పేరరసు, సముద్రకని, కార్తీక్‌సుబ్బరాజ్, నటుడు సౌందరరాజ్, చిత్రాలక్ష్మణన్  హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.