భయం లేదు!

22 Aug, 2016 00:24 IST|Sakshi

‘‘ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో? హిందీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో? లేదో? అని ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదల సమయంలో కాస్త భయం ఉండేది. ఇప్పుడా భయం లేదు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఎప్పుడు రిలీజవుతుందా? అని ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అన్నారు తమన్నా. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తదితర భారీ తారాగణంతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ ఇండియాతో పాటు విదేశాల్లోనూ భారీ విజయం సాధించింది. దాంతో సెకండ్ పార్ట్‌పై విపరీతంగా అంచనాలు పెరిగాయి.
 
  ఆ అంచనాలు చేరుకుంటామనే నమ్మకం ఉందన్నారు తమన్నా. ‘బాహుబలి: ది బిగినింగ్’లో ఈ మిల్క్ బ్యూటీ కత్తిపట్టి యుద్ధం చేసినా ఎక్కువ సమయం ప్రభాస్‌తో ఆడుతూ పాడుతూ కనిపించారు. ‘బాహుబలి 2’లో తమన్నా రోల్ మరింత స్ట్రాంగ్‌గా, యాక్షన్ బేస్డ్‌గా ఉంటుందట. ‘‘పీరియాడికల్ యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా హీరోలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ‘బాహుబలి’లో హీరోయిన్స్ క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి’’ అని తమన్నా పేర్కొన్నారు. ఇప్పటివరకూ 70 శాతం చిత్రీకరణ పూర్తయింది.
 
  ఓ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం చిత్రీకరణ మాత్రమే మిగిలిందని తమన్నా చెప్పారు. ప్రస్తుతం క్లైమ్యాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దర్శకుడు రాజమౌళి నవంబర్ కల్లా చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నారు. గ్రాఫిక్స్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఉండడంతో ఆ తర్వాత పోస్ట్-ప్రొడక్షన్ వర్క్స్ మీద దృష్టి పెడతారట. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు.