విజయ్ వసంత్‌కు దిమ్మ తిరిగింది

12 May, 2014 23:21 IST|Sakshi
విజయ్ వసంత్‌కు దిమ్మ తిరిగింది

నా దెబ్బకు విజయ్ వసంత్‌కు దిమ్మ తిరిగింది అంటోంది వర్ధమాన నటి మహిమ నంబియార్. విద్యార్థిని దశలోనే హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది ఈ మలయాళీ కుట్టి. సాట్టై చిత్రంతో కోలీవుడ్‌లో ప్రవేశించి, నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు చిత్రాలున్నాయి. వాటిలో మొసకుట్టి, పురావి 150 సీసీ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. విజయ్ వసంత్ సరసన నటించిన ఎన్నమో నడక్కుదు చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణను చూరగొంటోంది. దీంతో విజయానందంలో మునిగిపోయిన మహిమా నంబియార్‌ను పలకరించగా ఎన్నమో నడక్కుదు తన కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోతుందని పేర్కొంది. నిజం చెప్పాలంటే తాను స్టార్ నయ్యిపోవాలని కోరుకోవడం లేదంది. కథాబలం ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఎన్నమో నడక్కుదు చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. ఇందులో పూర్తిస్థారుు హీరోయిన్ పాత్ర పోషించినట్లు తెలిపింది.

ఈ చిత్రాన్ని అంగీకరించినప్పుడే చిత్ర విజయంపై నమ్మకం కలిగిందని చెప్పుకొచ్చింది. అయితే ఇంత పెద్ద విజయం సాధిస్తుందని మాత్రం ఊహించలేదంది. ఈ చిత్ర షూటింగ్‌లో జరిగిన ఒక సంఘటనను తానెప్పటికీ మరచిపోనని చెప్పింది. ఒక సన్నివేశంలో హీరో విజయ్ వసంత్‌ను చెంప మీద కొట్టాల్సి ఉందని ఆ సన్నివేశంలో తన ప్రమేయం లేకుండానే ఆయన చెంప చెళ్లుమనిపించానని చెప్పింది. తన దెబ్బతో విజయ్‌వసంత్‌కు దిమ్మతిరిగింది. ఆ రోజంతా ఆయన ఆ షాక్ నుంచి కోలుకోలేదంటే నమ్మండి అంటున్న మహిమ తన తదుపరి చిత్రాలకు మంచి విజయం సాధిస్తాయనే నమ్మకం ఉందని చెప్పింది. మొసకుట్టిలో గ్రామీణ యువతిగా నటించానని తెలిపింది. ఇందులో తనకు మావయ్యగా పశుపతి నటించారని వెల్లడించింది. అలాగే పురవి 150 సీసీ చిత్రంలో చెన్నై అమ్మాయిగా వైవిధ్యభరిత పాత్రను చేస్తున్నట్లు తెలిపింది. ఇది చెన్నై నుంచి కోయంబత్తూర్‌కు హీరో హీరోయిన్ల బైక్ పయనం ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం అని చెప్పింది. వీటితోపాటు అగత్ ఇనై అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నట్లు మహిమా నంబియార్ వెల్లడించింది.