గేమ్‌ ఆడండి..బహుమతి పట్టండి

26 Jun, 2018 09:29 IST|Sakshi

తమిళసినిమా: మీ మొబైల్‌లో గేమ్‌ ఆడండి. బహుమతి పట్టండి అయితే అందుకు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటున్నారు మిస్టర్‌ చంద్రమౌళి చిత్ర యూనిట్‌. నటుడు కార్తీక్‌ ఆయన కొడుకు గౌతమ్‌ కార్తీక్‌ హీరోలుగా కలిసి నటించిన చిత్రం మిస్టర్‌ చంద్రమౌళి. నటి రెజీనా హీరోయిన్‌గా నటించిన ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ కీలక పాత్రను పోషించారు. సతీష్, దర్శకుడు మహేంద్రన్, అగస్థ్యిన్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందించారు. బోఫ్టా మీడియా వర్క్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత ధనుంజయన్, క్రియేటివ్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహించారు. చిత్రం జూలై 6న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా దర్శక, నిర్మాతలు ప్రేక్షకులకు ఒక మొబైల్‌ గేమ్‌ను ప్రవేశ పెట్టారు.

ఆ గేమ్‌ను సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గేమ్‌ వివరాలను నిర్మాత ధనుంజయన్‌ తెలుపుతూ ఇది మూవీ క్విజ్‌ తరహా మొబైల్‌ యాప్‌ గేమ్‌ అని తెలిపారు. ఈ గేమ్‌లో రోజూ మిస్టర్‌ చంద్రమౌళి చిత్రానికి సంబంధించిన 10 ప్రశ్నలు ఉంటాయన్నారు. ఈ గేమ్‌ను ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకుని రెండు నిమిషాల్లో ఆ 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారికి వివో మొబైల్, వాచ్, టీషర్ట్, సినిమా టిక్కెట్స్‌లో ఏదో ఒకటి బహుమతిగా అందిస్తామని చెప్పారు. ఈ గేమ్‌ మంగళవారం నుంచి మొదలవుతుందని చెప్పారు. సమాధానాలు చెప్పిన వారు తమ వాట్సాప్‌ మొబైల్‌ఫోన్‌ నెంబర్‌ను రిజిస్టర్‌ చేయాలని చెప్పారు. ఎక్కువ మంది కరెక్ట్‌ సమాధానాలు చెబితే డ్రా విధానంలో రోజూ ఒకరికి బహుమతులను అందిస్తామన్నారు. ఈ గేమ్‌ను జూలై 6 వరకూ ఆడి బహుమతులను గెలుసుకోవచ్చునని నిర్మాత తెలిపారు. కార్యక్రమంలో నటుడు గౌతమ్‌కార్తీక్, నటి రెజీనా, వరలక్ష్మీ, సతీష్, దర్శకుడు తిరు చిత్ర వర్గాలు పాల్గొన్నాయి.

మరిన్ని వార్తలు