సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ దేశానికి అందిస్తున్న సేవలు, దేశాభివృద్ధికి ఆయన చేపడుతున్న పతకాల గురించి వివరిస్తూ, విశ్లేషిస్తూ తీసిన బాలీవుడ్ చిత్రం ‘మోదీ కా గామ్’ పేరును ‘మోదీ కాకా కా గామ్’ పేరిట విడుదల చేస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ నెల 29వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు.
భారతీయ జనతా పార్టీ సభ్యుడు సీఏ సురేశ్ ఝా దీన్ని నిర్మించగా.. తుషార్ అమష్ గోయెల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అచ్చం మోదీలాగా కనిపించే వికాస్ మహంతే నాగేంద్ర పాత్రలో నటించారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలకున్న అనుమానాలను తొలగించేందుకు చిత్రంలో ప్రయత్నించారు. పెద్ద నోట్ల రద్దు లాంటి వివాదాస్పద నిర్ణయాలతోపాటు దేశాభివృద్ధి కోసం ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలను సినిమా ప్రతిబింబిస్తుందని నిర్మాత తెలియజేశారు. భారత్ ఎంతగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందో, ఆ మేరకు అభివృద్ధి చేయడానికి మోదీ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు.