తర్వాత సంగతి తర్వాత!

7 Jan, 2018 00:44 IST|Sakshi

కొంతమంది మనస్తత్వం అంతే.. మనసులో ఏదనిపిస్తే అది బయటకు చెప్పేస్తారు. తర్వాత సంగతి తర్వాత అంటారు. ఎవరేమనుకుంటారో అని భయపడరు. లోపల ఒకటి అనుకొని బయట ఇంకోలాగా ప్రవర్తించటం వాళ్లకు చేత కాదు. అలాంటి మనస్తత్వం ఉన్న పాత్రనే పోషించారు శ్రియ ‘గాయత్రి’ సినిమాలో. ఈ సినిమాలో శ్రియ లుక్‌ను శనివారం విడుదల చేశారు. ‘నేనేదనుకుంటే అది చెప్పటం నాకలవాటు.. తర్వాత సంగతి తర్వాత’ అని క్యాప్షన్‌ ఉన్న ఆమె పోస్టర్‌ ఆకట్టుకునే విధంగా ఉంది.

అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పణలో మంచు మోహన్‌బాబు నటించి, శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ పై నిర్మించిన ఈ సినిమాలో గాయత్రి పాత్రను నిఖిలా విమల్‌ పోషించారు. విష్ణు, శ్రియ భార్యాభర్తలుగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు మదన్‌ రామిగాని దర్శకుడు. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సర్వేష్‌ మురారి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విజయ్‌కుమార్‌.ఆర్‌.

మరిన్ని వార్తలు