చెన్నైకి వణక్కం

14 Jun, 2019 01:13 IST|Sakshi

నాయకుడిగా, ప్రతినాయకుడిగా విభిన్నపాత్రల్లో 44 ఏళ్లుగా మోహన్‌బాబు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కెరీర్‌లో కొన్ని వందల చిత్రాలు చేసినప్పటికీ లేడీ డైరెక్టర్‌తో ఆయన చేసింది కేవలం ఒక్క సినిమానే. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ఓ చిత్రంలో నెగటివ్‌ పాత్ర చేశారాయన. తాజాగా మరో లేడీ డైరెక్టర్‌ సుధ కొంగర దర్శకత్వంలో నటించనున్నారు. సూర్య హీరోగా ‘గురు’ ఫేమ్‌ సుధ కొంగర దర్శకత్వంలో ‘సూరరై పోట్రు’ అనే చిత్రం తెరకెక్కుతోంది. సూర్యనే ఈ చిత్రానికి నిర్మాత. అపర్ణ బాలమురళి కథానాయిక.

ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు మోహన్‌బాబు కరెక్ట్‌గా సరిపోతారని చిత్రబృందం భావించింది. సూర్య, సుధ ఇద్దరూ లక్ష్మీ మంచుకి స్నేహితులు కావడంతో తన ద్వారా  మోహన్‌ బాబుని సంప్రదించారట. స్క్రిప్ట్‌ విన్న మోహన్‌బాబు వెంటనే నటించడానికి అంగీకరించారు. గతంలో శివాజీ గణేశన్, రజనీకాంత్‌తో తమిళ సినిమాల్లో స్క్రీన్‌షేర్‌ చేసుకున్నారు మోహన్‌బాబు. సావిత్రి జీవితం ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘మహానటి’తో చాలా గ్యాప్‌ తర్వాత తమిళ తెరపై కనిపించారాయన. ఇప్పుడు చేస్తున్న చిత్రంతో చెన్నైకి మళ్లీ వణక్కమ్‌ (నమస్కారం) చెప్పారాయన. ఈ చిత్రం షూటింగ్‌లో ఇవాళ (శుక్రవారం) జాయిన్‌ అవనున్నారు మోహన్‌బాబు. చెన్నైలోని ఎయిర్‌పోర్ట్‌లో చిత్రీకరించే కీలక సన్నివేశాల్లో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు