గౌరవ డాక్టరేట్‌ అందుకున్న మోహన్‌ బాబు

4 Oct, 2017 19:13 IST|Sakshi

సాక్షి, చెన్నై: విలక్షణ నటుడు, విద్యావేత్త మోహన్‌ బాబు చెన్నైలోని ఏంజీఆర్‌ యూనివర్సిటీ నుంచి బుధవారం గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కూతురు మంచు లక్ష్మీ ట్విట్టర్‌లో తెలియజేశారు. ‘మేము ఈ సందర్భాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వం. చెన్నైలో నాన్న ఏంజీఆర్‌ యూనివర్సటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.’  అని తమ్ముడు మంచు మనోజ్‌తో దిగిన ఫొటోతో పాటు మోహన్‌ బాబు, మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావుతో ఉన్న మరో ఫోటోను లక్ష్మీ ట్వీట్‌ చేశారు.

ఇది మోహన్ బాబు సినీ ప్రస్థానం లో మరో మైలు రాయి. మోహన్ బాబు కు ఇదివరకే అమెరికా లోని ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు సినిమా, విద్య రంగాల్లో కృషికి గాను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. 2007 లో ఆయనను భారత ప్రభుత్వం పద్మ శ్రీ తో గౌరవించింది. నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న మోహన్ బాబు కు గత ఏడాది బ్రిటిష్ పార్లమెంట్ లో బ్రిటన్ లోని ప్రముఖ భారతీయ వార్తా పత్రిక అయిన 'ఏషియన్ లైట్' వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది.  ప్రస్తుతం ఆయన నటించి నిర్మిస్తున్న గాయత్రి అనే సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నారు. 

మరిన్ని వార్తలు