మరోసారి సొంత గొంతుతో..!

12 Dec, 2016 15:17 IST|Sakshi
మరోసారి సొంత గొంతుతో..!

ప్రస్తుతం దక్షిణాది నటులందరూ తమ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలు తమ సినిమాలను ఒకే సమయంలో రెండు భాషల్లో రిలీజ్ చేస్తుంటే సీనియర్ హీరోలు కూడా అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేయకపోయినా.. తమ మాతృభాషలో సక్సెస్ అయిన సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ హీరోలు ఇప్పటికే ఈ ఫార్ములాతో విజయాలు సాధిస్తుండగా, మలయాళ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడిప్పుడే తెలుగు మార్కెట్ మీద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇప్పటికే మనమంతా, జనతా గ్యారేజ్ లాంటి తెలుగు సినిమాల్లో నటించిన మోహన్ లాల్, ఇప్పుడు తన డబ్బింగ్ సినిమాలతో కూడా అలరించాలని భావిస్తున్నాడు. ఈ శుక్రవారం మన్యంపులితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే సమయంలో తన మరో హిట్ సినిమా ఒప్పంను తెలుగు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో మనమంతా సినిమాకు సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకున్న మోహన్ లాల్, ఒప్పం డబ్బింగ్ వర్షన్లో మరోసారి తెలుగు ప్రేక్షకులకు సొంత గొంతు వినిపించాలని నిర్ణయించుకున్నాడు.

స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్లో సంచలన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు భారీ ఆఫర్లు వచ్చాయి. సౌత్లో తన మార్కెట్ను మరింత పెంచుకోవాలని భావిస్తున్న మోహన్ లాల్.. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రీమేక్ రైట్స్ను ఎవ్వరికీ ఇవ్వకుండా కేవలం డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. హిందీలో అక్షయ్ కుమార్, కన్నడలో శివరాజ్ కుమార్లు ఈ సినిమా రీమేక్లో నటిస్తున్నారు.