రిస్క్‌లోనే కిక్!

2 Nov, 2016 23:24 IST|Sakshi
రిస్క్‌లోనే కిక్!

సాగర గర్భంలో ఈత అంటే, స్విమ్మింగ్‌పూల్‌లో ఈదినంత సులువు కాదనే విషయం అందరికీ తెలిసిందే. తెలిసినప్పటికీ రిస్క్ చేసేవాళ్లు కొంతమంది ఉంటారు. దాని కోసం పని గట్టుకుని స్క్యూబా డైవింగ్ నేర్చుకుంటారు. సాగరంలో జలచరాలను చూసి, ఆనందించేస్తారు. ఇలాంటి ఆనందాన్ని త్రిష చాలాసార్లు పొందారు. రిస్క్‌లో ఓ కిక్ ఉందంటారామె. స్నేహితులతో విదేశీ యాత్రలకు వెళ్లినప్పుడు స్క్యూబా డైవింగ్ చేయకుండా దాదాపు వెనక్కి రారు. అదంతా సరదా కోసం అయితే ఇప్పుడు సినిమా కోసం చేశారు.

త్రిష టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘మోహిని’. రమణ మాదేష్ దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ మూవీ ఇది. ఈ చిత్రం కోసం నీటి లోపల కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలని దర్శకుడు చెప్పగానే, త్రిష ఓకే అనేశారు. ఆ సీన్స్‌ని ఇటీవల చిత్రీకరించారు. ఆ సమయంలో సాగరంలో దర్శకుడితో ఓ ఫొటో కూడా దిగారు. ‘‘నీటి లోపల మా డెరైక్టర్‌తో సరదాగా’’ అని ఈ సందర్భంగా త్రిష పేర్కొన్నారు. సినిమా కోసం ఎలాంటి రిస్కులైనా తీసుకోవడానికి ఇష్టపడే ఈ బ్యూటీ ఆ రిస్కులంటే తనకు బోల్డంత ఇష్టం అంటున్నారు. అంత ఇష్టంగా నటిస్తారు కాబట్టే, కథానాయిక అయ్యి పదమూడేళ్లయినా ‘నాట్ అవుట్’ అని చెప్పొచ్చు.