నటుడు ధనుష్ చిత్రం నుంచి నటి మోనాల్ గజ్జర్ వైదొలిగింది. తమిళంలో ఇంతకు ముందు శిఖరం తొడు, వానవరాయనుం వల్లవరాయనుం చిత్రాల్లో నాయకిగా నటించిన నటి మోనాల్గజ్జర్. అంతకు ముందే కొన్ని తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించిన ఈమె గుజరాతి భామ అన్నది గమనార్హం. ప్రస్తుతం మాతృభాషలోనే నటిస్తున్న మోనాల్ గజ్జర్కు తమిళంలో నటించిన చిత్రాలు పెద్దగా బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఇటీవల ధనుష్కు జంటగా వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టింది.
వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో నటి సురభి నటించిన పాత్రకు కొనసాగింపు పాత్రలో నటి మోనాల్గజ్జర్కు నటించే అవకాశం వచ్చింది. ధనుష్కు జంటగా నటించే అవకాశం కావడంతో ముందు వెనుకా ఆలోచించకుండా వెంటనే అంగీకరించిందట. ఇందులో మెయిన్ హీరోయిన్గా అమలాపాల్ నటిస్తున్నారు. కొన్ని రోజులు షూటింగ్లో పాల్గొన్న మోనాల్గజ్జర్ అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలగింది.
అందుకు తను చెప్పే కారణం తాను గుజరాతీ చిత్రాలతో బిజీగా ఉండడంతో ధనుష్ చిత్రానికి కాల్షీట్స్ సర్దుబాటు చేయలేకపోయానన్నది. అయితే వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రంలో తన పాత్రకు ప్రాధాన్యం లేకపోవడం వల్లే మోనాల్ గజ్జర్ ఈ చిత్రానికి గుడ్బై చెప్పినట్లు కోడంబాకం గుసగుసలు. చిత్రసీమలో ఇలాంటివన్నీ మామూలే. ఏదేమైనా ఇప్పుడామె పాత్రకు మరో నటిని ఎంపిక చేసే పనిలో చిత్ర యూనిట్ పడినట్లు సమాచారం.