ఇండస్ట్రీలో కూడా ఎవరికి తెలియదు: సింగర్‌

11 Jun, 2020 14:43 IST|Sakshi
భర్త మైక్ రిచ్టేతో మోనాలి ఠాకూర్‌

తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో గోప్యంగా ఉంచే బాలీవుడ్‌ సింగర్‌ మోనాలీ ఠాకూర్‌ ఓ రహస్యాన్ని వెల్లడించి అందరికి షాక్‌ ఇచ్చారు. మూడు సంవత్సరాల క్రితమే తనకు వివాహం అయ్యిందని తెలిపారు. అయితే దీని గురించి ఎవరికి తెలియదని చెప్పారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోనాలి ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నా వివాహం గురించి సోషల్‌ మీడియాతో సహా ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ మూడు సంవత్సరాల క్రితమే నేను స్విట్జర్లాండ్‌కు చెందిన రెస్టారెంట్ యజమాని మైక్ రిచ్టేను వివాహం చేసుకున్నాను. 2017లోనే మాకు పెళ్లి జరిగింది. మూడేళ్లుగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాం. అయితే కొన్ని సార్లు నా ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటోల్లో ఉంగరం కనిపించేది. దాంతో జనాలు పెళ్లి చేసుకున్నావా అని ప్రశ్నించేవారు’ అని తెలిపారు.

అంతేకాక తన వివాహం గురించి ఇండస్ట్రీలోని స్నేహితులకు కూడా తెలియదని.. ఈ విషయం వారిని నిజంగానే షాక్‌కు గురి చేస్తుందన్నారు మోనాలి. ‘వారిని నేను పెళ్లికి పిలవలేదు. కనీసం వివాహం చేసుకున్నట్లు చెప్పాలి.. పార్టీ ఇవ్వాలి అనుకుంటూనే మూడేళ్లు గడిచిపోయాయి. త్వరలోనే గ్రాండ్‌ రిసెప్షన్‌ను ఏర్పాటు చేసి.. అందరిని పిలుస్తాను. అప్పుడు ఎవరికి నా మీద కోపం ఉండదు’ అన్నారు. మోనాలి ఠాకూర్ ‘రేస్’ చిత్రంలో ‘జరా జరా టచ్ మి’, ‘లూటెరా’ సినిమాలో ‘సావర్ లూన్’, ‘బద్రీనాథ్ కి దుల్హానియా’ చిత్రంలో ‘బద్రీ కి దుల్హానియా’ వంటి పాటలు పాడారు.  2015లో  ‘దమ్ లగా కే హైసా’ చిత్రంలోని ‘మోహ్ మోహ్‌ కే ధాగే’ పాటకి ఉత్తమ ఫిమేల్‌ ప్లేబ్యాక్ సింగర్‌గా జాతీయ అవార్డును గెలుచుకున్నారు.

మరిన్ని వార్తలు