ర్యాంప్ కంటే కెమెరానే ఇష్టం: కృతి సనన్

7 Jun, 2014 13:40 IST|Sakshi
ర్యాంప్ కంటే కెమెరానే ఇష్టం: కృతి సనన్

ర్యాంప్ మీద హొయలొలికిస్తూ క్యాట్ వాక్ చేయాలంటే అంత సులభం ఏమీ కాదట. దానికంటే సినిమాల్లో చేయడమే చాలా సులభమని చెబుతోంది '1.. నేనొక్కడినే' హీరోయిన్ కృతి సనన్. గతంలో ఆమె తరుణ్ తహిల్యానీ, రోహిత్ బల్ లాంటి ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులతో ర్యాంప్ వాక్ చేసింది. దానివల్ల తన ఆత్మవిశ్వాసం పెరిగినా, ఇప్పటికీ ర్యాంపు మీదకు వెళ్తే చాలా భయపడతానని, కెమెరా ముందయితే సులభంగా చేయగలుగుతున్నానని కృతి చెప్పింది.

ర్యాంప్ మీద నడిచేటప్పుడు ఎదురుగా ప్రేక్షకులు ఉంటారని, వాళ్లను చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ కొన్ని నిమిషాల పాటు ఉండాలని చెప్పింది. అదే కెమెరా ముందయితే తప్పులు చేసినా మళ్లీ దిద్దుకోడానికి వీలుంటుందని కృతి తెలిపింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన కృతి.. అక్కడి ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివింది. తర్వాత ఈసీఈ గ్రూపుతో బీటెక్ చేసింది. ఐదేళ్ల వయసులో తొలిసారిగా ర్యాంపు మీద నడిచింది. అప్పట్లో మధు సప్రే, మిళింద్ సోమన్ లాంటి పెద్ద నటీనటులతో కలిసి ఆమె మోడలింగ్ చేసింది. టీవీ ప్రకటనల్లో నటించేటప్పుడే తనకు కెమెరా అంటే ఇష్టం ఏర్పడిందని, తర్వాత షూటింగ్ను ఎంజాయ్ చేశానని చెప్పింది. తెలుగులో మహేష్ బాబు సరసన '1.. నేనొక్కడినే' సినిమా తర్వాత బాలీవుడ్లో జాకీష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ సరసన 'హీరోపంతీ' సినిమాలో నటించింది. కంగనా రనౌత్, దీపికా పదుకొనే, అనుష్కా శర్మలకు మంచి ఫ్యాన్ అయిన కృతి.. కేవలం గ్లామర్ డాల్గానే ఉండాలని అనుకోవడంలేదు. అన్ని రకాల పాత్రలు చేస్తానంటోంది.