బాలీవుడ్‌లో మరో బయోపిక్‌.. ఎవరిదంటే

11 Mar, 2019 19:54 IST|Sakshi

హిట్టు, ఫ్లాఫ్‌తో పని లేకుండా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలే కాక ఇతర రంగాల్లో గుర్తింపు పొం‍దిన ప్రముఖుల గురించి కూడా బయోపిక్‌లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రముఖ వ్యక్తి బయోపిక్‌ మనల్ని పలకరించనుంది. సేవే పరమావధిగా బతికి.. ప్రపంచానికంతటికి తల్లిగా గుర్తింపు తెచ్చుకున్న ‘మదర్‌ థెరీసా’ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్‌ తెరకెక్కనుందట. మదర్ థెరిసా జీవితం గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఇలా వచ్చిన పుస్తకాల్లో సీమా ఉపాధ్యాయ్ రచించిన ‘మదర్ థెరీసా.. ది సెయింట్’ అనే పుస్తకం బాగా పాపులర్ అయింది.  ఈ పుస్తకం ఆధారంగా ఇప్పుడు మదర్ థెరీసా బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారు. సీమా ఉపాధ్యాయే దర్శకత్వం వహించే ఈ చిత్రం 2020 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. 

ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మదర్‌ థెరీసా శాంతికి, సేవకు చిహ్నంగా నిలుస్తారు. ఆమె జీవితం ఎందరికో ఆదర్శం. అందుకే ఆమె జీవితం గురించి ప్రేక్షకులకు తెలయజేయాలనుకుంటున్నాం. ఈ బయోపిక్‌కు మొదలు పెట్టాలని అనుకోగానే ముందు కోల్‌కతాలోని చారిటీకి వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకున్నాం. ఈ చిత్రంలోని పలు పాత్రలను జాతీయ అంతర్జాతీయ నటీనటులు పోషిస్తారు. 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని తెలిపారు. ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టిన మదర్ థెరిసా, ఇండియా వచ్చి.. కోల్‌కతా ప్రాంతంలో అనాధ శరణాలయాన్ని స్థాపించారు.  ఆ శరణాలయం ద్వారా లక్షలాది మందిని చేరదీసి అమ్మగా మారారు. ఆమె సేవలకు ప్రతిఫలంగా నోబెల్‌ శాంతి పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు