నాడు ప్రేయసి...నేడు వదిన..!

22 Jul, 2014 22:47 IST|Sakshi
నాడు ప్రేయసి...నేడు వదిన..!

 హిందీ రంగాన్ని ఒకప్పుడు ఉర్రూతలూగించిన తారల్లో మౌసమీ చటర్జీ ఒకరు. చక్కని రూపానికి మంచి అభినయం తోడవ్వడంతో మౌసమీ పదేళ్లకు పైగా హిందీ తెరను ఓ స్థాయిలో ఏలారు. హిందీలో చేసిన తొలి చిత్రం ‘అనురాగ్’లో అంధురాలిగా నటించి, శభాష్ అనిపించుకున్నారామె. ఆ తర్వాత అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు చాలానే చేశారు. కథానాయికగా ఓ పదిహేనేళ్లు చేసిన తర్వాత, సహాయ పాత్రలు చేయడం మొదలుపెట్టారు మౌసమీ.
 
  ఈ మధ్య అడపా దడపా మాత్రమే నటిస్తున్నారామె. ఈ నేపథ్యంలో ‘పీకు’ అనే చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారని సమాచారం. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ఇర్ఫాన్‌ఖాన్ ముఖ్యతారలు కాగా, ఇటీవలే మౌసమీని ఎంపిక చేశారు. ఇందులో అమితాబ్‌కి వదినగా నటించనున్నారామె. అమితాబ్ బచ్చన్ సరసన ‘బేనామ్’, ‘మంజిల్’ తదితర చిత్రాల్లో నటించారు మౌసమీ. ఒకప్పుడు బిగ్ బీ సరసన ప్రేయసిగా నటించి, ఇప్పుడు ఆయనకు వదినగా చేయడం అంటే విశేషమే.