సెలవులో నరేశ్‌.. బెనర్జీకి ఛాన్స్‌

4 Mar, 2020 20:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) తాత్కాలిక అధ్యక్షుడిగా బెనర్జీ ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్‌ నరేశ్‌ 41 రోజులు సెలవు పెట్టడంతో బై లాస్‌ ప్రకారం ఉపాధ్యక్షుడు బెనర్జీకి అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈ విషయంపై బుధవారం ఫిల్మ్‌ చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిసిప్లినరీ, ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ సభ్యులు పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, మెగాస్టార్‌ చిరంజీవి, సీనియర్‌ నటుడు మురళీమోహన్‌, సీనియర్‌ నటి జయసుధ, ‘మా’ జనరల్‌ సెక్రటరీ జీవితా రాజశేఖర్‌, నటీనటులు హేమ, రాజీవ్‌ కనకాల, శివబాలాజీ, అనితా చౌదరీ, జయలక్ష్మి, కరాటే కళ్యాణి, ఏడిద శ్రీరామ్‌, రవి ప్రకాష్‌ టార్జాన్‌, పసునూరి శ్రీనివాస్‌, రాజా రవీంద్ర, అలీ, సురేష్‌ కొండేటి, తనీష్‌, ఆశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇక ఈ ఏడాది ప్రారంభంలో ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసాగా సాగిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు వంటి అతిరథుల సమక్షంలోనే మాజీ ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ అధ్యక్షుడు నరేశ్‌పై ఆరోపణలు చేశారు. అయితే సభ్యులతో రాజశేఖర్‌ ప్రవర్తించిన తీరు, వేదికపై మాట్లాడిన తీరుపై చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాజశేఖర్‌పై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్‌ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఇదే సమయంలో ‘మా’ సభ్యులు వివాదాలు మానుకొని కలసి పనిచేయాలని చిరంజీవి సూచించారు. అంతేకాకుండా తెలుగు సినిమా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చిన సంగతి విదితమే.

మరిన్ని వార్తలు