ముగిసిన ‘మా’ ఆత్మీయ సమావేశం

20 Oct, 2019 18:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఆత్మీయ సమావేశం ఎట్టకేలకు ముగిసింది. త్వరలోనే మరోసారి అందరూ సమావేశం కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. ‘మా’లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సమావేశంలో సభ్యులు తీర్మానం చేశారు. సినీ పెద్దల సూచనలు, సలహాలతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించింది. కాగా సమావేశం ముగిసిన అనంతరం మా అసోసియేషన్‌ కార్యదర్శి రాజశేఖర్‌, ఆయన భార్య జీవిత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.  ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, వివరాలు తర్వాత చెబుతామని తెలిపారు.

కాగా నరేశ్‌ అధ్యక్షతన ఏర్పడిన  మా కొత్త కార్యవర్గం సభ్యుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు కాకముందే రెండు వర్గాలుగా ఏర్పడటంతో విభేదాలు పొడచూపాయి. అధ్యక్షుడు నరేశ్‌, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయని వార్తల నేపథ్యంలో.... ఆదివారం మా’ సభ్యుల సమావేశంఉందంటూ జీవితా రాజశేఖర్‌ మెస్సేజ్‌ ఇవ్వడం  నరేశ్‌ కార్యవర్గానికి షాక్‌కు గురిచేసింది. అయితే కోర్డు ఆర్డర్‌ ప్రకారం ఇది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని కేవలం ఆత్మీయ సమావేశం మాత్రమేనని జీవితా రాజశేఖర్‌ తెలిపారు. 

ఆ వార్తల్లో వాస్తవం లేదు: కరాటే కల్యాణి
త్వరలోనే ‘మా’ అసోసియేషన్‌ జనరల్‌ బాడీ సమావేశం కూడా జరుగుతుందని మా ఈసీ సభ్యులు కరాటే కళ్యాణి తెలిపారు. ఆమె ఆదివారమిక్కడ మాట్లాడుతూ...‘ ఈ రోజు జరుగుతున్న సమావేశం ఆత్మీయ సమ్మేళనం మాత్రమే. అసోసియేషన్‌లో రెండు గ్రూలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. అందరం ఒక్కటిగా కూర్చొని మా సమస్యలు పరిష్కరించుకుంటాం​.’ అని అన్నారు. 

పెద్దలు జోక్యం చేసుకోవాలి..
సినీ నటుడు మాణిక్‌ మాట్లాడుతూ... మా అసోసియేషన్‌లో చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయి. జనరల్‌ సెక్రటరీ, ప్రెసిడెంట్‌ల మధ్య చిన్న గొడవలున్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి మరోసారి భేటీ అవుతాం. సినీ పెద్దలు చిరంజీవి, వెంకటేశ్‌, కృష్ణంరాజు, బాలకృష్ణ తదితరులు కలగజేసుకుని సమస్యను పరిష్కరించాలి’ అని కోరారు.

చదవండి:

నాకు ఆ పదవి అక్కర్లేదు.. రాజీనామా చేస్తా : పృథ్వీ

‘మా’లో మరో కొత్త  వివాదం..

మరిన్ని వార్తలు