చిన్న బ్రేక్‌

27 Jun, 2020 03:15 IST|Sakshi
త్రిష, ప్రియాప్రకాశ్‌ వారియర్‌, శ్రియా పిల్గోన్కర్‌, సోనాక్షీ సిన్హా, యామీ గౌతమ్‌

– డిజిటల్‌ డిటాక్స్‌

‘‘వ్యక్తిగత, వృత్తి కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అప్‌డేట్స్‌ ఇస్తూ, అప్పుడప్పుడూ చిట్‌చాట్‌ సెషన్స్‌తో తమ ఫాలోయర్స్, ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటుంటారు సినిమా స్టార్స్‌. అయితే సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం అనేది కొంచెం ఒత్తిడితో కూడుకున్న పనే అని కొందరు స్టార్స్‌ అంటున్నారు. ఈ ఒత్తిడిని తప్పించుకోవడానికి ఇటీవల పలువురు తారలు ‘డిజిటల్‌ డిటాక్స్‌’ (సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం) సూత్రం ఫాలో అవుతున్నారు. కరోనా కారణంగా అందరూ సామాజిక దూరం పాటిస్తున్నాం. ‘డిజిటల్‌ డిటాక్స్‌’ అంటూ ఇటీవల సామాజిక మాధ్యమానికి బ్రేక్‌ ఇచ్చిన స్టార్స్, చిన్న బ్రేక్‌ తర్వాత మళ్లీ యాక్టివ్‌గా ఉంటున్న స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.


మళ్లీ కలుద్దామని చెప్పి డిజిటల్‌కి దూరమైపోయారు త్రిష. ‘‘నా మైండ్‌కు కాస్త ఉపశమనం కావాలి. ఇది డిజిటల్‌ చికిత్స అనుకోవచ్చు. కొంచెం గ్యాప్‌ తర్వాత మళ్లీ కలుద్దాం’’ అంటూ ట్వీటర్‌కి చిన్న బ్రేక్‌ ఇచ్చారు త్రిష. ఇటీవలే ‘టిక్‌టాక్‌’లో కూడా త్రిష ఎంట్రీ ఇచ్చారు.
 

మరో హీరోయిన్‌ యామీ గౌతమ్‌ ‘‘నా ప్రతి విషయాన్నీ ఇతరులతో పంచుకోవాలనుకోవడం లేదు’’ అని డిజిటల్‌ డిటాక్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు.

మరో బ్యూటీ పరిణీతీ చోప్రా ‘‘నా కోసం నాకు కొంత సమయం కావాలి. నా గురించి నేను మరింత తెలుసుకోవాలి. అందుకే కొంతకాలం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలనుకోవడం లేదు’’ అన్నారు.

‘‘ఈ క్వారంటైన్‌ టైమ్‌ని నా కోసం సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే సోషల్‌ మీడియాకు కొంతకాలం దూరంగా ఉంటాను’’ అన్నారు శ్రియా పిల్గోన్కర్‌. రానా నటించిన ‘హాథీ మేరీ సాథీ’ (తెలుగులో ‘అరణ్య’) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు ఈ బ్యూటీ.

సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ప్రియాప్రకాశ్‌ వారియర్‌ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను డీ యాక్టివేట్‌ చేసి కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ‘‘మానసిక ప్రశాంతత కోసమే నా ఇన్‌స్టా అకౌంట్‌ను డీ యాక్టివేట్‌ చేశాను. లైక్‌లు, షేర్‌లు వంటివి నాలో ఒత్తిడిని పెంచాయనిపిస్తోంది. కొంత సమయం తర్వాత ఇప్పుడు నేను తిరిగి ఇన్‌స్టాలోకి వచ్చాను. భవిష్యత్‌లో కూడా కావాలనుకుంటే కొన్ని రోజులు నా అకౌంట్‌ను డీ యాక్టివేట్‌ చేస్తాను’’ అన్నారు ప్రియాప్రకాశ్‌ వారియర్‌.

డీయాక్టివేట్‌
ట్వీటర్‌లో నెగటివిటీ పెరిగిపోయిందని తన అకౌంట్‌ను డీ యాక్టివేట్‌ చేశారు సోనాక్షీ సిన్హా.  నెగటివిటీ, అసభ్యపదజాలంతో కూడిన కామెంట్స్‌ ఎక్కువైపోయాయని, అందుకే ట్వీటర్‌ నుంచి వైదొలుగుతున్నానని అన్నారు బాలీవుడ్‌ నటుడు సాకిబ్‌ సలీమ్‌. ‘బద్రీనాథ్‌కి దుల్హనీయా, ధడక్‌’ చిత్రాలను తెరకెకెక్కించిన బాలీవుడ్‌ దర్శకుడు శశాంక్‌ కేతన్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌ను డీ యాక్టివేట్‌ చేశారు. ‘‘సోషల్‌ మీడియా వల్ల రియల్‌ వరల్డ్‌ ఫేక్‌ వరల్డ్‌లాగా, ఫేక్‌ వరల్డ్‌ రియల్‌ వరల్డ్‌గా కనిపిస్తోంది’’ అంటున్నారు  కృతీసనన్‌.      

మరిన్ని వార్తలు