ఉరేసరి

21 Mar, 2020 06:43 IST|Sakshi

నిర్భయ అత్యాచారం కేసులో నిందితులుగా నిలిచిన నలుగురిని శుక్రవారం ఉరి తీశారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో తమ స్పందనను తెలియజేశారు. ‘ఉరే సరి’ అని అభిప్రాయాలను పేర్కొన్నారు.  

ఆలస్యమైనా న్యాయం జరిగింది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం తగ్గిపోకుండా ఉండేందుకు నిర్భయ కేసు మరో ఉదాహరణ అయింది. నిర్భయ కేసు కోసం పోరాడిన ఆమె తల్లి, న్యాయవాదులందరికీ సెల్యూట్‌ చేస్తున్నాను. న్యాయ వ్యవస్థకు నా గౌరవాన్ని తెలియజేస్తున్నాను. ఇలాంటి ఘోర సంఘటనలు జరగకుండా ఉండేందుకు మరిన్ని కఠిన చట్టాలు, సత్వర తీర్పులు తీసుకురావాలని కోరుతున్నాను.

– మహేశ్‌బాబు
 
ఏడేళ్ల సుదీర్ఘ సమయం తర్వాత నిర్భయ దోషులను ఉరి తీశారు. న్యాయం కోసం ఇన్నేళ్లు నిర్విరామంగా పోరాడిన నిర్భయ తల్లిగారు, న్యాయవాదులకు నా సెల్యూట్‌.  

– రవితేజ
 
నిర్భయ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జైహింద్‌.  

– మనోజ్‌ మంచు
 
ఒకరి చావు నాకు బోలెడు రిలీఫ్‌ ఇస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అలాగే కొంతమందికి భయాన్నిస్తే చాలు.

– హరీష్‌ శంకర్‌
 
నిర్భయ దోషులను ఉరి తీశారనే అద్భుతమైన వార్తతో నా రోజుని ప్రారంభించాను. న్యాయం చేకూరింది.

– తమన్నా భాటియా
 
చాలా ఏళ్ల తర్వాత నిర్భయ తల్లిదండ్రులు ప్రశాంతంగా నిద్రపోతారని అనుకుంటున్నాను. చాలా పెద్ద యుద్ధమే చేశారు. ఆశా దేవి (నిర్భయ తల్లి) గారికి నా సెల్యూట్‌

– తాప్సీ
 


న్యాయం నిజంగా జరిగిందనుకుందామా? అత్యాచారం చేసిన ఆరు నెలల్లో ఉరి తీయాలనే చట్టాన్ని తీసుకురావాలి. ఇలాంటి సంఘటనల్లో అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయినా తీర్పును అమలు చేయడంలో ఇంత ఆలస్యం చేయడమెందుకు?  

– వరలక్ష్మీ శరత్‌ కుమార్‌
 
నిర్భయ కేసు మరింత త్వరగా ముగిసి ఉండాల్సింది. ఇప్పటికైనా ముగిసినందుకు సంతోషం. 

– ప్రీతీ జింటా
 
   నిర్భయ దోషులను ఉరి తీశారు. అత్యాచారానికి శిక్ష మరణమే. ఈ నిర్ణయం ఇండియాలోనే కాదు...ప్రపంచవ్యాప్తంగా కూడా ఓ ఉదాహరణగా నిలవాలి. మహిళలను గౌరవించాలి. నిర్భయ దోషులను ఉరి తీయడాన్ని ఆలస్యం చేయడానికి ప్రయత్నించిన వారిని చూసి సిగ్గుపడతున్నా  

– రిషీ కపూర్‌
 
ఈ భూమి మీద నలుగురు రాక్షసులు (నిర్భయ దోషులను ఉద్దేశిస్తూ) ఇకపై లేరు. నిర్భయ తల్లిదండ్రులు దీనికోసం ఏడేళ్లుగా ఎదురు చూశారు. చివరికి నిర్భయ ఆత్మకు శాంతి కలిగింది  

– రవీనా టాండన్‌
 
కఠినమైన చట్టాలు, శిక్షలు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా సత్వర తీర్పులు వంటివి మాత్రమే నిర్భయలాంటి ఘటనలకు పాల్పడాలనుకునేవారికి భయాన్ని కలిగిస్తాయి. కాస్త ఆలస్యమైనా న్యాయం చేకూరింది  

– రితేష్‌ దేశ్‌ముఖ్‌
 
ఇవాళ (శుక్రవారం) దేశానికి న్యాయం జరిగింది. నిర్భయ తల్లి రూపంలో మనందరికీ ఓ హీరో దొరికారు. ఈ తీర్పు వల్ల న్యాయవ్యవస్థ మీద గౌరవం అలానే కొనసాగుతుంది. అలాగే  తప్పు చేయాలనుకునే ఆలోచనలు ఉన్నవాళ్లకు ఓ హెచ్చరికగానూ ఉంటుంది.

– ప్రణీతా సుభాష్‌

ఈ కేసు గెలవడానికి నిర్భయ తల్లికి ఏడేళ్లు పట్టింది. ఈ ఏడేళ్ల సమయంలో ఎన్నో అవమానాలు, మాటలు భరించాల్సి వచ్చిందామె. అవన్నీ దాటుకుంటూ ముందుకు వచ్చి పోరాడారు.. ‘అంత ఆలస్యంగా బయట ఏం చేస్తుందో?’ అని సులువుగా ఓ మాట అనేసి తన (నిర్భయ) వ్యక్తిత్వాన్ని తప్పుబట్టినవాళ్లందరూ స్వీయ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను.

మరిన్ని వార్తలు