నీకోసం బాగాలేదంటే డబ్బులు వెనక్కి!

5 Sep, 2019 09:14 IST|Sakshi

‘‘మనిషి చనిపోయాక చాలా ప్రేమను చూపెడతారు. కానీ, బతికున్నప్పుడే ఆ ప్రేమని పంచుకుంటే జీవితం బాగుంటుందని మా ‘నీ కోసం’లో చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు అవినాష్‌ కోకటి. అరవింద్‌ రెడ్డి, అజిత్‌ రాధారామ్, సుభాంగి పంత్, దీక్షితా పార్వతి హీరో  హీరోయిన్లుగా అవినాష్‌ కోకటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీకోసం’. రాజలింగం సమర్పణలో అల్లూరమ్మ (భారతి) నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. అవినాష్‌ కోకటి మాట్లాడుతూ– ‘‘మా సినిమాలోని ప్రేమ కథలు చాలాకాలం ప్రేక్షకులతో ప్రయాణం చేస్తాయి.

మరచిపోయిన లేదా వదిలేసిన బంధాలన్నీ గుర్తొస్తాయి’’ అన్నారు. ‘‘నీకోసం’ ఎందుకు చూడాలి? అనేవారికి నేనిచ్చే భరోసా ఒక్కటే. మా సినిమా ఆడుతున్న థియేటర్స్‌ కౌంటర్‌ వద్ద నా మొబైల్‌ నంబర్‌ ఇస్తాను. సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను’’ అన్నారు అరవింద్‌ రెడ్డి. ‘‘యూత్‌కి కనెక్ట్‌ అయ్యే కథ ఇది’’అన్నారు అజిత్‌ రాధారామ్‌. ‘‘ఇది లవ్‌ స్టోరీ మాత్రమే కాదు.. లైఫ్‌ స్టోరీ కూడా’’ అన్నారు సుభాంగి పంత్‌. ‘‘మంచి టీమ్‌తో పని చేశానని సంతోషంగా ఉంది’’ అన్నారు దీక్షితా పార్వతి. సంగీత దర్శకుడు శ్రీనివాస్‌ శర్మ మాట్లాడారు.

మరిన్ని వార్తలు