‘మిస్టర్‌ ఇండియా 2’ లేనట్లే!

17 May, 2018 00:22 IST|Sakshi
శ్రీదేవి

కొన్ని పాత్రలు కొందరిని వెతుక్కుంటూ వెళతాయని సినీ ప్రముఖులు అంటుంటారు. శ్రీదేవి కెరీర్‌లో అలాంటి పాత్రలు చాలా ఉన్నాయి. ‘మిస్టర్‌ ఇండియా’ లో శ్రీదేవి చేసిన ‘సీమా సోనీ’ క్యారెక్టర్‌ అలాంటిదే. ఈ పాత్రలో ఆమె ఎంత అద్భుతంగా నటించారంటే.. వేరే ఏ నాయికనూ ఊహించుకోలేం. ఈ చిత్రదర్శకుడు శేఖర్‌ కపూర్‌ కూడా అదే అంటున్నారు. శ్రీదేవి చనిపోవడంతో ‘మిస్టర్‌ ఇండియా’కి సీక్వెల్‌ తీయాలనే తన ఆలోచన చనిపోయిందని శేఖర్‌ కపూర్‌ పేర్కొన్నారు.

శ్రీదేవి లేకుండా సీక్వెల్‌ తీస్తే తాజ్‌మహల్‌ లేని ఆగ్రాలా, నర్గిస్‌ లేని ‘మదర్‌ ఇండియా’ సినిమాలా ఉంటుందనీ, ‘మిస్టర్‌ ఇండియా’కి బలం అనిల్‌ కపూర్, అమ్రిష్‌ పురి, శ్రీదేవి అనీ, అమ్రిష్, శ్రీదేవి చనిపోయారు కాబట్టి, వారి ప్లేస్‌లో వేరే ఆర్టిస్టులను తీసుకుని సీక్వెల్‌ చేస్తే పాత మేజిక్‌ని రీ–క్రియేట్‌ చేయలేమని చిత్రనిర్మాత–శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ భావించారట. అందుకే సీక్వెల్‌ తీయాలనే ఆలోచన మానుకున్నారని సమాచారం. ‘‘సీక్వెల్‌ గురించి బోనీ ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నేను మాత్రం సీక్వెల్‌ని డైరెక్ట్‌ చేయలేను. శ్రీదేవి చనిపోవడంతో చాలా కలలు చనిపోయాయి. వాటిలో ‘మిస్టర్‌ ఇండియా’ సీక్వెల్‌ ఒకటి’’ అని శేఖర్‌ కపూర్‌ పేర్కొన్నారు. సో.. ‘మిస్టర్‌ ఇండియా 2’ రెండో భాగం లేనట్లే.

మరిన్ని వార్తలు