క్లాసిక్‌ వదిలి డర్టీగా..

4 Jan, 2020 16:42 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా తర్వాత పలువురు దర్శకనిర్మాతలు తమ పంథా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా కొందరు యువ దర్శకులు బోల్డ్‌ కంటెంట్‌ సినిమాలకు అధిక ప్రాధ్యనతనిస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ జాబితాలో సీనియర్‌ దర్శక నిర్మాత ఎంఎస్‌ రాజు కూడా చేరిపోయినట్లుగా తెలుస్తోంది. ఎన్నో ఫీల్‌ గుడ్‌ సినిమాలను టాలీవుడ్‌కు అందించిన ఎంఎస్‌ రాజు తన రూట్‌ మార్చుకున్నాడు. శ్రవణ్‌ రెడ్టి టైటిల్‌ రోల్‌లో ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘డర్టీ హరి’.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.  బాత్‌ టబ్‌లో షర్ట్ లేకుండా ఉన్న హీరోకు ఓ అమ్మాయి తన కాళ్లతో సిగరెట్ అందిస్తున్నట్టుగా ఉన్న స్టిల్‌తో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెటింట్లో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఈ పోస్టర్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో తెలిసిపోతుందని కొందరు కామెంట్‌ చేస్తుండగా.. ‘ఎంఎస్‌ రాజును కూడా మార్చేశారు కదా’అంటూ మరికొంత మంది సరదాగా పేర్కొంటున్నారు. . 

మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి అద్భుత ప్రేమకథలను నిర్మించిన ఎంఎస్‌ రాజు.. వాన, తూనీగ తూనీగ వంటి లవ్‌ క్లాసికల్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే నిర్మాతగా సక్సెస్‌ సాధించినా.. కమర్షియల్‌ డైరెక్టర్‌గా రాణించలేకపోయాడు. ఈయన డైరెక్షన్‌లో వచ్చిన రెండు చిత్రాలకు మంచి పేరొచ్చినా.. కమర్షియల్‌గా హిట్‌ సాధించలేకపోయాయి. 

దీంతో సినిమాలకు చిన్న విరామం తర్వాత ‘డర్టీ హరి’ తో మరోసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఎలాగైనా డైరెక్టర్‌గా విజయం సాధించాలనే ఉద్దేశంతో బోల్డ్‌ అండ్‌ అడల్ట్‌ కామెడీని డైరెక్టర్‌ ఎంచుకున్నాడని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్‌ వివరాలతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం ప్రకటించింది.  

మరిన్ని వార్తలు