ఎక్తా కపూర్‌ ‘మహాభారతాన్ని’ చంపేసింది

8 Apr, 2020 11:36 IST|Sakshi

నిర్మాత ఎక్తా కపూర్‌ మహభారతాన్ని చంపేసిందంటూ నటుడు ముఖేష్‌ ఖన్నా ఆమెపై విరుచుకుపడ్డారు. 2008లో వచ్చిన ‘కహానీ హమారా మహాభారతం’ సీరియల్‌ను ఎక్తా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ సీరియల్‌ పునః ప్రసారం అవుతుంది. కాగా ముఖేష్‌ ఖన్నా హీరోగా నటించిన ‘శక్తిమాన్‌’ను కూడా పునః ప్రసారం చేయనున్నట్లు చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘శక్తిమాన్‌’ న్యూ వర్షన్‌ను మళ్లీ ప్రసారం చేయనున్నాం. అయితే ఇది ఎక్తా ‘మహాభారతం’ తరహాలో ఉండదు. ఈ సీరియల్‌లో ద్రౌపతి పాత్రకు భుజంపై టాటూ ఉంటుంది. అయితే ఎక్తా మహాభారతాన్ని ఆధునికంగా తీస్తున్నట్లు సీరియల్‌ మొదట్లోనే చెప్పారు. సంస్కృతి అనేది ఎప్పుటికీ ఆధునికమైనది కాదు.. కాలేదు కూడా. ఒకవేళ ఆధునికం చేయాలని ప్రయత్నించిన రోజే.. సంస్కృతి అంతమైపోతుంది’ అని మండిపడ్డారు. 

ఒకవేళ ఈ సీరియల్‌ పేరు ‘క్యుంకీ గ్రీక్‌ భీ కబీ హిందూస్థానీ’ అయుంటే తాను ఎక్తా ‘మహాభారతాన్ని’ సమర్థించేవాడినని అన్నారు. ఒక ఇతిహాసాన్ని మార్చే హక్కు వారికి ఎవరూ ఇచ్చారని విమర్శించారు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడి కంటే ఎక్తా తెలివిగా ఉండాలని ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. రామయణం, మహాభారతాలు పురాణాలు మాత్రమే కాదని, అవి మన భారతదేశ చరిత్రలుగా ఎత్తిచూపాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. (మహాభార‌తం తిరిగి వ‌చ్చేసింది)

మరిన్ని వార్తలు