జ్ఞానోదయం అయింది!

4 Apr, 2017 00:21 IST|Sakshi
జ్ఞానోదయం అయింది!

సినిమాకి రీక్యాప్‌లా అసలేం జరిగిందంటే...
‘బాహుబలి–2’ ప్రీ–రిలీజ్‌ వేడుక గత నెల 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అన్ని కళ్లూ ఆ వేడుకను చూడాలనుకున్నాయి. అదే జరిగింది. అలాగే అన్ని నోళ్లూ ఆ రోజు కీరవాణి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకున్నా యి. ‘‘నేను ఎక్కువగా బ్రెయిన్‌లెస్‌ దర్శకులతో పని చేశా. వేటూరి, సిరివెన్నెల తర్వాత తెలుగు సినిమా సాహిత్యం అంపశయ్య పై ఉంది’’ అని ఆ రోజు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఎవరి అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉన్నట్లే, ఆ అభిప్రాయాలను విమర్శించే హక్కు కూడా అందరికీ ఉంటుంది. 

‘కీరవాణిగారూ.. ఎందుకయ్యా మీకు ఇవన్నీ..’ అంటూ దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు. ఇతర ప్రముఖులెవరైనా కీరవాణికి సలహాలిచ్చారేమో. అందుకే సోమవారం ట్విట్టర్‌లో కీరవాణి ఈ విధంగా స్పందించారేమో!

మీ సలహా తప్పకుండా పాటిస్తా తమ్మారెడ్డి భరద్వాజ్‌గారూ... థ్యాంక్స్‌.. ఒక ట్వీట్‌లో ‘మోస్ట్‌లీ’ అనే పదం వాడాను. అది చాలామందిని బాధపెట్టింది. కానీ, టీబీ (తమ్మారెడ్డి భరద్వాజ్‌) వంటి పెద్దవారు మంచి సలహా ఇచ్చారు. టీబీ సలహాకు సంబంధించిన కొన్ని ట్వీట్స్‌ను తొలగించాను.

మనం ఎప్పటికీ విద్యార్థులమే.. తప్పులు చేస్తుంటాం. అయితే తమ్మారెడ్డి భరద్వాజ్‌ లాంటి వారే మన తప్పులను సరిదిద్దగలరు.

గౌరవనీయులైన దర్శకులందరూ మేథావులని సడన్‌గా నాకు జ్ఞానోదయం కలిగింది. ఎవరైనా తెలివితక్కువవారు ఉన్నారంటే.. అది నేనేనేమో!

నేను తప్ప అందరూ సృజనాత్మకత కలిగినవారే. ఎంత ఎదిగినా అందరూ ఒదిగి ఉంటున్నవారే.

నాకు ఎవరో ఒక నిఘంటువు పంపారు. అందులో పొగరుకి ‘ఎమ్‌.ఎమ్‌.కె’ (అంటే ఎం.ఎం. కీరవాణి) అని అర్థం ఉందట. ఆ పుస్తకం మొత్తం చదువుతాను.

ప్రపంచంలో ఉన్న దర్శకులందరూ గొప్పవారు. వారితో పనిచేసేందుకు నేను తహతహలాడుతున్నాను. కానీ, నేను ఓల్డ్‌ బ్రెయిన్‌లెస్‌ కంపోజర్‌ని కాబట్టి, అవకాశాలు తక్కువ వస్తాయనుకుంటున్నా.

కేవలం ఐదు నిమిషాల్లోనే బుర్ర లేని నా మతిని తమ్మారెడ్డి భరద్వాజ్‌ వాష్‌ చేశారు.

ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు.

తమ్మారెడ్డి భరద్వాజ్‌గారికి మళ్లీ థ్యాంక్స్‌. త్యాగయ్యగారికి ధన్యవాదాలు.

నాకు పాటల రచయితలందరూ ఇష్టమే. ఎంతో కష్టపడి వాళ్లు రాస్తున్న పాటలంటే ఇష్టమే.  వాళ్లను ఎలా మరచిపోయాను? (నేను వృద్ధుణ్ణి అయిపోతున్నా).

వేటూరిగారికి 100 మార్కులు, సిరివెన్నెల సీతారామశాస్త్రికి 90, మా నాన్నగారికి 35, నాకు 10 మార్కులేనని నా అభిప్రాయం. మిగతా వారందరూ 11 మార్కుల నుంచి 89 మార్కుల మధ్యలో ఉంటారు..

ఇటీవల సాయిగారు టీవీ ప్రోగ్రామ్‌ చూశారు. ఆ ప్రోగ్రామ్‌లో టాలీవుడ్‌లో కంపోజర్స్‌ కొరత ఉందని అన్నారు. ఆ మాటలను నేను వ్యతిరేకించాను. ఆయన్ను ఎడ్యుకేట్‌ చేశాను.

నిజానికి రైటర్స్‌ కొరత అధికంగా ఉంది. వాళ్లకు తక్కువ పారితోషికం ఇస్తున్నారు.

తన 30 ఏళ్ళ అనుభవంలో మా నాన్నగారు నాకు 20 పాటలకంటే తక్కువగా రాశారు. ఎందుకంటే ఆయన అవుట్‌సైడర్‌ కదా. నేను బంధు ప్రీతిని సపోర్ట్‌ చేస్తాను. చంద్రబోస్‌గారు నాకు బావ. ఆయన నాకోసం చాలా పాటలు రాశారు. (వ్యంగ్య ధోరణిలో)

నెపోటిజమ్‌ను (బంధు ప్రీతిని) నేను నమ్ముతాను. వసుధైక కుటుంబాన్ని ప్రోత్సహిస్తాను. ఒకవేళ అది తప్పయితే నాలాంటి బుర్రలేనివారిని బాగుచేయండి.

రాజమౌళి నా మీద కోపంగా ఉన్నాడు. ‘బాహుబలి–2’ వర్క్‌ని కంప్లీట్‌ చేయమని రాజమౌళి తొందరపెడుతున్నాడు. ఎందుకంటే ఆర్కా మీడియా  ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్‌ 28న విడుదల చేయాలనుకుంటోంది. మళ్లీ కలుద్దాం మిత్రులారా.

అనంత శ్రీరామ్‌ పాటలు రాయడం మానేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాటలు రాస్తున్నారు. దాంతో ప్రతిభ ఉన్న రచయితలకు అవకాశాలు తగ్గుతున్నాయి.

నిజమే... తెలుగు లిరిక్స్‌ అంపశయ్యపై లేవు. కానీ అనంత శ్రీరామ్‌ మాత్రం సంక్షోభంలో ఉన్నాడు.

నీతి వాక్యాలు,  దేశభక్తి పాటలే రాయమని మాత్రమే దర్శకులు తనను అడుగుతున్నారని అనంత శ్రీరామ్‌ చెప్పాడు.

డ్యూయెట్లు, ఐటమ్‌ సాంగ్స్‌ హీరోలు, హీరోయిన్లు, సింగర్స్‌.. వీళ్లంతా రాసేస్తున్నారని అనంత శ్రీరామ్‌ అన్నాడు.