ఆమె కోరిక తీరేనా?

9 Dec, 2017 01:42 IST|Sakshi

తమిళసినిమా: మహిమానంబియార్‌ కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదుగుతున్న మాలీవుడ్‌ కుట్టీ ఈ బ్యూటీ. సాట్టై చిత్రం ద్వారా తమిళసినిమాకు పరిచయమైన మహిమకు ఆ చిత్రం మంచి పేరునే తెచ్చి పెట్టింది. ఆ తరువాత ఎన్నమో నడక్కుదు, కుట్రం 23 వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. అయితే తమిళం, మలమాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. మహిమానంబియార్‌ శశికుమార్‌తో జత కట్టిన కొడివీరన్‌ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా మహిమ పేర్కొంటూ కొడివీరన్‌ చిత్రంలో గ్రామీణ యువతిగా నటించానని చెప్పింది. నటనకు అవకాశం ఉన్న పాత్ర అని చెప్పింది. కొడివీరన్‌ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. సరే స్టార్‌ హీరోలతో నటించాలని లేదా అన్న ప్రశ్నకు ఈ బ్యూటీ బదులిస్తూ ఎందుకు లేదూ అసలు తన పెద్ద కోరికే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో నటించాలని, ఆయన చిత్రంలో ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంది.

ఇక అజిత్‌ అంటే చాలా ఇష్టం అని, ఆయనతో జత కట్టాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. అదే విధంగా ఇలయదళపతితో స్టెప్స్‌ వేయాలని, నటుడు ధనుష్‌తో నటించాలని ఉంది. అయితే అవకాశాలు రావాలిగా అని అంది. అయితే తనకంటూ ఒక టైమ్‌ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న మహిమానంబియార్‌కు సూపర్‌స్టార్‌తో నటించాలనే కోరిక నెరవేరుతుందా అన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు రవిఅరసు దర్శకత్వంలో జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా ఐన్‌గరన్, ఇరవుక్కు ఆయిరం కణ్‌గళ్‌ చిత్రంలో అరుళ్‌నిధితోనూ నటిస్తోంది. ఇక మాత్రభాషలో మమ్ముట్టికి జంటగా మాస్టర్‌ పీస్‌ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాలు విడుదల తరువాత తన స్థాయి పెరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.

మరిన్ని వార్తలు