మూడు పదుల తర్వాతే మూడు ముళ్లు!

16 Apr, 2015 22:37 IST|Sakshi
మూడు పదుల తర్వాతే మూడు ముళ్లు!

‘‘పెళ్లి గురించి నాకో స్థిరమైన అభిప్రాయం లేదు. వివాహ బంధం చాలా గొప్పదని ఈరోజు అనిపిస్తుంటుంది. రెండు, మూడు రోజుల తర్వాత పెళ్లనేది చాలా వృథా వ్యవహారం అనిపించేస్తుంది’’ అని కంగానా రనౌత్ అంటున్నారు. ‘తను వెడ్స్ మను’కి సీక్వెల్‌గా మాధవన్ సరసన ఆమె నటించిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ వచ్చే నెల 22న విడుదల కానుంది. వివాహ బంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటించాక కూడా పెళ్లి గురించి మీకో స్థిరమైన అభిప్రాయం ఏర్పడలేదా? అనే ప్రశ్న కంగనా ముందుంచితే - ‘‘లేదు.
 
 నేను ఏ కథనూ మనసు వరకూ తీసుకెళ్లను. ఒకవేళ నిజంగా ఆలోచింపజేసే కథలైతే అప్పుడు నా ఆలోచనల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ వివాహ బంధం నేపథ్యంలో సాగే సినిమా అయినప్పటికీ ఓ ప్రేమకథలా ఉంటుంది. తమ బంధం గొప్పదేనా? అని పరీక్షించుకుని చివరికి ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అనే నిర్ణయానికి వచ్చే కథ ఇది’’ అన్నారు. రీల్ మీద పెళ్లి చేసుకున్నారు... రియల్‌గా ఎప్పుడు చేసుకుంటారు? అనడిగితే - ‘‘ఇప్పుడు నాకు 28 ఏళ్లు. కెరీర్ బ్రహ్మాండంగాఉంది. ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు మూడు పదుల వయసు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కనీసం 35 ఏళ్లయినా రావాలి’’ అని పేర్కొన్నారు.