ఇస్మార్ట్‌తో కిర్రాక్‌ పోరీ

1 Feb, 2019 02:24 IST|Sakshi
నభా నటేష్‌

టాలీవుడ్‌లో హీరోయిన్‌ నభా నటేష్‌ మంచి ఫామ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ఈ కన్నడ బ్యూటీకి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. రవితేజ హీరోగా నటించనున్న ‘డిస్కోరాజా’ సినిమాలో ఒక హీరోయిన్‌గా నభా నటేష్‌ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఇది వార్తల్లో ఉండగానే.. నభా మరో అవకాశం కొట్టేశారు. రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో ఓ నాయికగా నభాని తీసుకున్నారు.

ఈ విషయాన్ని నిర్మాతలు చార్మీ, పూరి జగన్నాథ్‌ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఆల్రెడీ ఒక హీరోయిన్‌గా నిధీ అగర్వాల్‌ ఎంపిక అయ్యారు. ‘‘కిర్రాక్‌ హైదరాబాద్‌ పోరీ నభా నటేష్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారు’’ అని చార్మీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫస్ట్‌ షెడ్యూల్‌ దాదాపు 40 రోజులు సాగుతుందని సమాచారం. ఈ చిత్రం మేలో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు