లెజండరీ నటి సావిత్రి బయోపిక్ని ‘మహానటి’ పేరుతో వెండితెరపై చక్కగా ఆవిష్కరించి మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. తొలి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’తో హిట్ సాధించిన నాగ్ అశ్విన్ రెండో సినిమా ‘మహానటి’తో ఘన విజయం అందుకున్నారు. గత ఏడాది మేలో ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఆ చిత్రం తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయనున్నారనే ఆసక్తి ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు అటు ప్రేక్షకుల్లో నెలకొంది.
పలువురు హీరోలు అశ్విన్తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపారని టాక్. అయితే తాజాగా నాగ్ అశ్విన్ తన కొత్త సినిమాను ప్రకటించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమా సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. ‘సాహసం సెప్టెంబర్లో మొదలవుతుంది. ఈ సినిమాకు రచయితలు, విజువల్ ఆర్టిస్ట్స్, డిజైనర్స్ కొత్తవారు కావాలి. అందుకోసం అన్వేషణ జరుగుతోంది’’ అని వైజయంతీ మూవీస్ ప్రకటించింది, ఈ సినిమా హీరో, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మాత్రం ప్రకటించలేదు.