చైతూ మనసుకి దగ్గరైంది!

25 Aug, 2016 00:15 IST|Sakshi
చైతూ మనసుకి దగ్గరైంది!

 నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రేమమ్’. శ్రుతీహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సెప్టెంబర్ 20న స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ చిత్రం పాటలను విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేయాలనుకున్నారు.
 
 ఇప్పుడు విజయదశమి కానుకగా అక్టోబర్‌లో విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. నాగచైతన్య మాట్లాడుతూ - ‘‘నా మనసుకు బాగా దగ్గరైన ప్రేమకథా చిత్రమిది. లవ్ అండ్ రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్. ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది. మలయాళ సినిమా రీమేక్ అయినా దర్శకుడు చందు మొండేటి తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కొద్దిగా మార్పులు చేసి, తెరకెక్కించారు’’ అన్నారు.
 
  నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇటీవల విడుదలైన ‘ఎవరే..’ పాటకు మంచి స్పందన లభించింది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆ పాట వీడియోను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ఈశ్వరీరావు, బ్రహ్మాజీ, జీవా, చైతన్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గోపీసుందర్, రాజేశ్ మురుగేశన్.