కొత్త నాగశౌర్యను చూస్తారు

15 Oct, 2019 00:22 IST|Sakshi
సంతోష్‌ జాగర్లమూడి, నాగశౌర్య, సునీల్‌ నారంగ్, శరత్‌ మరార్‌

నాగశౌర్య హీరోగా ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్‌ సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సోమవారం కొబ్బరికాయ కొట్టారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నారాయణదాస్‌ నారంగ్, శరత్‌మరార్, రామ్‌మోహన్‌రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన మొదటి సన్నివేశానికి నిర్మాత ‘దిల్‌’ రాజు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా శరత్‌ మరార్‌ మాట్లాడుతూ– ‘‘నారాయణదాస్‌ నారంగ్, రామ్‌మోహన్‌రావుగార్లతో కలిసి నాగశౌర్యతో సినిమా నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది.

ఇదొక స్పోర్ట్‌ బేస్డ్‌ మూవీ. కథ అద్భుతంగా ఉంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘సునీల్‌గారు, శరత్‌ మరార్‌గారి కాంబినేషన్లో నా సినిమా ప్రారంభమవడం సంతోషంగా ఉంది. సంతోష్‌ రెండో చిత్రమిది. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్‌పై వర్క్‌ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్‌. తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘క్రీడా నేపథ్యంలో సాగే  చిత్రమిది. ఒక ఊహాజనిత బయోపిక్‌లా ఉంటుంది. నాకు మంచి మైలేజ్‌ ఇచ్చే మూవీ అవుతుంది. ఇందులో సరికొత్త నాగశౌర్యని చూస్తారు’’ అన్నారు సంతోష్‌ జాగర్లపూడి. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్‌ రెడ్డి.
 

మరిన్ని వార్తలు