అమ్మమ్మ గుర్తుకు రావడం ఖాయం

25 May, 2018 04:26 IST|Sakshi
సుందర్‌ సూర్య, కె.ఆర్‌., రాజేష్, సాయికార్తీక్, నాగశౌర్య, బేబి షామిలీ, రసూల్, సుమిత్ర, సుధ

నాగశౌర్య

‘‘సుందర్‌గారు ‘అమ్మమ్మగారిల్లు’ వంటి మంచి కథ చెప్పడమే కాదు.. చెప్పినట్లు తీశారు కూడా. ఈ సినిమా చూస్తే కచ్చితంగా అమ్మమ్మ గుర్తుకు వస్తుంది’’ అని నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, బేబి షామిలీ జంటగా సుందర్‌ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వప్న సమర్పణలో కె.ఆర్‌ సహ నిర్మాతగా రాజేష్‌ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘సుమిత్రగారు అమ్మమ్మగారి పాత్రకు అతికినట్లు సరిపోయారు. రసూల్‌గారు సినిమాను అద్భుతమైన విజువల్స్‌తో చూపించారు. ఆయనతో ‘ఒకరికి ఒకరు’ లాంటి సినిమా చేయాలని ఉంది. బేబి షామిలీ చిన్నప్పుడు చేసిన సినిమాలు చూశాను.

ఇప్పుడు హీరోయిన్‌గా తను ఈ సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని చాలామంది నటీనటులు అనుభవం ఉన్నవారే. నాకు చక్కటి సహకారం అందించారు. షామిలీగారికి స్టోరీ చెప్పగానే నచ్చడంతో ఆలోచించకుండా చేస్తానన్నారు. నాగశౌర్యగారు లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు సుందర్‌ సూర్య. ‘‘నాగశౌర్య, షామిలి సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారం వల్లే ఇంత మంచి సినిమా చేశాం. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు సహ నిర్మాత కె.ఆర్‌. ‘‘మా అమ్మమ్మగారితో మంచి అనుబంధం ఉంది. అదే వాతావరణాన్ని ఈ సినిమా షూటింగ్‌ సమయంలో చూశాను’’ అన్నారు బేబి షామిలీ. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కెమెరామెన్‌ రసూల్, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నటీనటులు మధుమణి, హేమ, గౌతంరాజు, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు