సినిమా ఆగిపోలేదు.. 50 శాతం పూర్తయింది

26 Feb, 2020 11:13 IST|Sakshi

కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన యువ నటుడు అవసరాల శ్రీనివాస్‌. అష్టా చమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల కొద్ది రోజుల్లోనే ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారాడు. రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్‌ లాంగ్ గ్యాప్ తర్వాత యంగ్‌ హీరో నాగశౌర్యతో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో అనేకవార్తలు వస్తున్నాయి. బడ్జెట్‌ పెరిగిపోవడం, ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌పై దర్శకనిర్మాతలు అసంతృప్తిగా ఉండటంతో సినిమాను ఆపేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ తమ అధికారిక ట్విటర్‌ ద్వారా స్పందించింది. 

‘నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్‌ 50 శాతం పూర్తయింది. చాలా అద్భుతంగా సినిమా రూపొందుతోంది. మిగతా షూటింగ్‌ యూఎస్‌ఏలో ప్లాన్‌ చేశాం. వీసాల కోసం వేచి చూస్తున్నాం. యూఎస్‌ఏ షెడ్యూల్‌ కూడా త్వరగానే పూర్తిచేస్తాం. ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవి. పుకార్లను నమ్మకండి’అంటూ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత వివేక్ కూచిభొట్ల ట్వీట్‌ చేశారు. ఇక అశ్వథ్థామతో హిట్‌ ట్రాక్‌లో వచ్చిన యంగ్‌ హీరో నాగశౌర్య వరుస సినిమాలో జోరుపెంచాడు. అవసరాల శ్రీనివాస్‌తో ఓ సినిమా రూపొందుతుండగానే.. లక్ష్మీసౌజన్య అనే కొత్త దర్శకురాలితో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

చదవండి:
‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ
'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు'


మరిన్ని వార్తలు