కొత్త సినిమాను ప్రారంభించిన యంగ్‌ హీరో

14 Oct, 2019 15:11 IST|Sakshi

‘ఛలో’ సినిమాతో మంచి హిట్టు అందుకున్న యంగ్‌ హీరో నాగశౌర్య.. మళ్లీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. నర్తనశాల, అమ్మమ్మగారి ఇల్లు వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నా.. బాక్సాఫీస్‌ వద్ద ఆ సినిమాలు బోర్లాపడ్డాయి. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించే​ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్‌ హీరో.. తాజాగా మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు.  

నాగశౌర్య హీరోగా 'సుబ్రమణ్యపురం' ఫేమ్‌ సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నారయణదాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ నివ్వగా, దిల్‌ రాజు కెమెరా స్విచాన్‌ చేశారు. మొదటి సన్నివేశాన్ని దేవుడి పటాలపై చిత్రీకరించారు. 

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడుతూ.. ‘ఇదొక స్పోర్ట్‌ బేస్డ్‌ మూవీ. కథ అద్భుతంగా ఉంది  అలాగే సంతోష్‌ ప్రామిసింగ్‌ డైరెక్టర్‌. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం'' అన్నారు. యంగ్‌ హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ‘ఏషియన్‌ సునీల్‌ గారు. శరత్‌ మరార్‌ గారి కాంబినేషన్లో ఈ చిత్రం ప్రారంభమవడం సంతోషంగా ఉంది. సంతోష్‌కు రెండో చిత్రం ఇది. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్‌ మీద వర్క్‌ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్‌ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు. ఇక చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు