చైసామ్‌ రొమాంటిక్‌ డ్రామా

11 Oct, 2018 02:00 IST|Sakshi
నాగచైతన్య, సమంత

నాగచైతన్య–సమంత.. టాలీవుడ్‌ మోస్ట్‌ క్రేజియస్ట్‌ కపుల్‌. పెళ్లి తర్వాత తొలిసారి ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. ‘నిన్ను కోరి’ సినిమా ఫేమ్‌ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్‌ మరో కథానాయికగా నటిస్తున్నారు. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు.

నాగచైతన్య 17వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లెంగ్తీ షెడ్యూల్‌లో చైతూ, సమంత పాల్గొంటుండగా, వీరి కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా (ఏమాయ చేసావె, మనం, ఆటోనగర్‌ సూర్య) కావడం విశేషం. ‘‘రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఏర్పడింది’’ అని నిర్మాతలు అన్నారు. రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు శర్మ.

మరిన్ని వార్తలు