చేసామ్‌ పెళ్లి

8 Oct, 2017 00:54 IST|Sakshi

ఎవ్వరికి ఎవ్వరిని జతగా అనుకుంటాడో...ఆఖరికి వాళ్లనే ఓచోట కలిపేస్తాడు... పైవాడు! ‘ఏ మాయ చేసావె’లో చైతూ, సమంతల పెళ్లి సందర్భంలో వచ్చే పాటలోని పల్లవి ఇది. బహుశా... ‘ఏ మాయ చేసావె’ చిత్రదర్శకుడు గౌతమ్‌ మీనన్, ఆ పాట రాసిన అనంత శ్రీరామ్‌ కూడా అప్పుడు ఊహించి ఉండరేమో!? ‘నాగచైతన్య, సమంతలకు పైలోకంలో వాడు ఎపుడో ముడి వేశాడు’ అని! శుక్రవారం మూడుముళ్ల బంధంతో ఒక్కటైన చేసామ్‌ (చైతూ, సమంత) శనివారం బైబిల్‌ సాక్షిగా... ఉంగరాలు మార్చుకుని జీవితాంతం ఒకరికి తోడుగా మరొకరు ఉంటామని ప్రమాణం చేసుకున్నారు.

పాటలో చెప్పినట్టు ‘నింగీ నేలా గాలీ... నీరూ నిప్పూ అన్నీ... నిండు నూరేళ్లు జతగా ఉండమ’ని చైతూ, సమంతలను దీవించేశాయి! కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా! శుక్రవారం హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిన తర్వాత గోవాలోని హోటల్‌లోనే పార్టీ కూడా జరిగింది. అందులో చైతూ తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేశ్‌ చేసిన సందడి హైలైట్‌గా నిలిచిందని ఆహుతులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కూడా పార్టీ మాంచి సందడిగా జరిగిందట!

మరిన్ని వార్తలు