ప్రస్తుతం తెలుగు తెరపై మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. మొన్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మసాలా’. ఆ తర్వాత మంచు మోహన్బాబు కుటుంబం నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’. అలాగే అక్కినేని కుటుంబం నటించిన ‘మనం’. ఇక తాజాగా... వెంకటేశ్, పవన్కల్యాణ్ కలిసి ‘ఓ మై గాడ్’ హిందీ సినిమా రీమేక్లో నటిస్తుండడంతో మల్టీస్టారర్ ట్రెండ్ బాగా ఊపందుకున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు మరో భారీ మల్టీస్టారర్కి కూడా రంగం సిద్ధం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే... నాగార్జున, ఎన్టీఆర్ల సినిమా.
పైడిపల్లి వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వినికిడి. ఓ భారీ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నదట. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుందని ఫిలింనగర్ టాక్. నందమూరి, అక్కినేని హీరోలు కలిసి నటించిన చివరి సినిమా ‘సీతారామరాజు’. నాగార్జున, హరికృష్ణ నటించారందులో. ఈ వార్తే నిజమైతే... మళ్లీ పదిహేనేళ్ల తర్వాత ఈ రెండు కుటుంబాల హీరోలు కలిసి నటించే సినిమా ఇదే అవుతుంది.