ఎన్‌ అండ్‌ ఎన్‌... న్యూ ఇయర్‌లో బిగిన్‌!

19 Oct, 2017 02:04 IST|Sakshi

ఎన్‌ ఫర్‌... నాగార్జున. ఎన్‌ ఫర్‌... నాని. వీళ్లిద్దరూ హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పతాకంపై ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ సిన్మాల ఫేమ్‌ శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో సి. అశ్వనీదత్‌ ఓ మల్టీస్టారర్‌ నిర్మించనున్నారని గతంలోనే ‘సాక్షి’ తెలియజేసింది. నాగార్జునతో ‘ఆఖరి పోరాటం, గోవిందా గోవింద, రావోయి చందమామ, ఆజాద్‌’ వంటి హిట్‌ సిన్మాలను వైజయంతి సంస్థ నిర్మించింది. ఇక, వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్‌ నాని ‘ఎవడే సుబ్రమణ్యం’ను నిర్మించింది.

ఇప్పుడు నాగ్, నానీ హీరోలుగా నిర్మించనున్న మల్టీస్టారర్‌కి కొత్త ఏడాదిలో కొబ్బరికాయ కొట్టనున్నారు. న్యూ ఇయర్‌ బిగినింగ్‌ మంత్‌ జనవరిలోనే ఈ సినిమా బిగిన్‌ కానుంది. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు మొదలుకుని చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ వరకూ, అలాగే పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌లతో పలు సూపర్‌హిట్‌ సిన్మాలను నిర్మించిన వైజయంతి మూవీస్‌ సంస్థ కొంత విరామం తర్వాత నిర్మిస్తున్న చిత్రమిది. సి. అశ్వనీదత్‌ మాట్లాడుతూ– ‘‘నాగార్జున, నానీలకు కథ బాగా నచ్చింది. ఫన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. సరికొత్త జోనర్‌లో శ్రీరామ్‌ ఆదిత్య సినిమా తీయబోతున్నారు’’ అన్నారు.

మరిన్ని వార్తలు