జస్ట్‌ ఇంకో నెల... అంతే!

23 Jan, 2018 01:32 IST|Sakshi

జోరు అందుకుంది. అవును.. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్‌ నిర్మించనున్న చిత్రం పనులు జోరుగా సాగుతున్నాయి. నాగార్జున–నాని కాంబినేషన్‌లో సంస్థ అధినేత సి. అశ్వనీదత్‌ ఒక సినిమా ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ వంటి రెండు విజయాలను అందించిన శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఆరేడు నెలలుగా ఈ ప్రాజెక్ట్‌ గురించి వార్తలు వస్తున్నాయి కానీ ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ లేదు. ఈ సినిమా మొదలు కావడానికి జస్ట్‌ ఇంకో నెల... అంతే.

వచ్చే నెల 24న షూటింగ్‌ మొదలుపెట్టాలనుకుంటున్నామని యూనిట్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పటికల్లా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నాగ్‌ చేస్తున్న సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయిపోతుందట. అలాగే, నాని చేస్తోన్న ‘కృష్ణార్జున యుద్ధం’ కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఈ హీరోలిద్దరూ వైజయంతి మూవీస్‌ నిర్మించే సినిమాతో బిజీ అవుతారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఊహించని మలుపులతో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుందట. మంచి కామెడీతో, ట్విస్టులతో సిన్మా థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుందట. అంటే... ఎన్‌ అండ్‌ ఎన్‌... అదేనండీ నాగార్జున అండ్‌ నాని ఫుల్‌ ఫన్‌ ఇస్తారన్నమాట.

మరిన్ని వార్తలు